న్యూయార్క్ : ఆదాయం పెంచుకోవడం, సబ్స్క్రైబర్ల సంఖ్యను నిలుపుకునేందుకు స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఎంపిక చేసిన మార్కెట్లలో యాడ్ సపోర్టెడ్ సబ్స్ర్కిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టగా తాజాగా పాస్వర్డ్ షేరింగ్ను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. దశల వారీగా ప్రతి ఒక్కరికీ పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ను తొలగిస్తామని నెట్ఫ్లిక్స్ మాజీ సీఈఓ రీడ్ హస్టింగ్స్ గత ఏడాది వెల్లడించారు.
ఇక కంపెనీ న్యూ కో-సీఈఓలు గ్రెగ్ పీటర్స్, టెడ్ సరండోస్ బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూజర్లందరికీ త్వరలో నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ముగుస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఇక నుంచి భారత్లో ఫ్రెండ్స్, ఇతరుల పాస్వర్డ్ను ఉపయోగించి నెట్ఫ్లిక్స్ను యాక్సెస్ పొందే వారు ప్లాట్ఫాంను ఉపయోగించుకునేందుకు పే చేయాల్సి ఉంటుంది. నెట్ఫ్లిక్స్కు ఎలాంటి చెల్లింపులు లేకుండా ప్లాట్ఫాంను ఉపయోగించుకునే వారు ఇకనుంచి కంటెంట్ను వీక్షించేందుకు చెల్లింపులు చేపట్టాల్సి ఉంటుందని పీటర్స్ పేర్కొన్నారు. పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ను నిలిపివేసినా సబ్స్క్రైబర్ బేస్పై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ యోచిస్తోంది.
భారత్ వంటి దేశాలపై దృష్టి సారించడం ద్వారా 1.5 నుంచి 2 కోట్ల వరకూ సబ్స్ర్కైబర్ల సంఖ్య పెరుగుతుందని సీఈఓలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెండ్ పాస్వర్డ్ను యూజ్ చేసేందుకు భారత్లో యూజర్కు ఎంత చార్జ్ విధిస్తారనేది స్ట్రీమింగ్ దిగ్గజం వెల్లడించలేదు. ఇతర దేశాల్లో రూ 250 వసూలు చేయాలని నెట్ఫ్లిక్స్ యోచిస్తుండగా భారత్లోనూ దాదాపు అదే మొత్తం ఉంటుందని భావిస్తున్నారు. భారత్ సహా పలు మార్కెట్లలో ఈ ఏడాది మార్చి నుంచి పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్కు నెట్ఫ్లిక్స్ తెరదించనుందని సమాచారం.