Nasa’s Orion capsule | పలు ఆటంకాలను ఎదుర్కొని నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ ఎట్టకేలకు జాబిల్లి వద్దకు చేరింది. 50 సంవత్సరాల క్రితం అపోలో మిషన్ తర్వాత నాసా క్యాప్సూల్ చంద్రుడిపైకి వెళ్లడం ఇదే తొలిసారి. 401 మిలియన్ల డాలర్ల వ్యయంతో గత బుధవారం నాసా ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, క్యాప్సూల్ భూమికి 3.70లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా.. హ్యూస్టన్లోని ఓరియన్ ఫ్లయిట్ కంట్రోలర్లు సంబంధాలు కోల్పోయాయి.
దీంతో ఏం జరుగుతుందో తెలియక సైంటిస్ట్లు ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట తర్వాత మళ్లీ సంబంధాలను పునరుద్ధరించారు. చందమామ వెనుక వైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి క్యాప్సూల్ వెళ్లిందని, ఇది అత్యంత కీలకమైన ముందడగని నాసా పేర్కొంది. ఈ సందర్భంగా చిత్రాలను నాసా విడుదల చేసింది.
భారీ పరిమాణంలో చంద్రుడు కనువిందు చేస్తుండగా.. నీలిరంగులో భూమి చిన్న సైజులో కనిపించింది. రేడియో కాంటాక్ట్ను తిరిగి పొందినప్పుడు క్యాప్సూల్ గంటకు 8వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పనిచేస్తుందని నాసా తెలిపింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ జూలై 20, 1969న ల్యాండ్ అయిన ట్రాంక్విలిటీ బేస్కి అరగంట కంటే తక్కువ వ్యవధిలో క్యాప్సూల్ చందమామ వద్దకు చేరిందని, అన్నీ సవ్యంగా జరిగే క్యాప్సూల్ను సరైన కక్షలో పెట్టేందుకు శుక్రవారం మరోసారి ‘ఇంజిన్ ఫైరింగ్’ చేయనున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
భూమికి చేరుకునే ముందు క్యాప్సూల్ వారం పాటు చంద్రుడి కక్ష్యలో తిరగనున్నది. డిసెంబరు 11న పసిఫిక్ ఓషలన్లో క్యాప్సూల్ను దింపాలని నాసా చూస్తున్నది. ఈ మిషన్ విజయవంతమైతే, 2024లో చంద్రుని దగ్గరికి వ్యోమగాములను పంపాలని నాసా భావిస్తున్నది. 2025 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు ఓ వెహికిల్ను ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది.