దాదాపు ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నీ అంగారకుడిపై నీటి ఆనవాలు కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంగారక గ్రహంపై గతంలో నీరు ప్రవహించిందని కనుగొంది.
అయితే ఇది జరిగింది 2 వందల కోట్ల సంవత్సరాల క్రితమని పేర్కొంది. నాసాకు చెందిన మార్స్ రికనసెన్స్ ఆర్బిటార్ (ఎమ్ఆర్వో) ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంగారకుడి ఉపరితలంపై మంచు నీరు ఆవిరైపోయిన తర్వాత మిగిలిపోయిన క్లోరైడ్ సాల్ట్ నిల్వలను పరిశోధకులు గుర్తించారు.
వాటిపై రకరకాల అధ్యయనాలు చేశారు. ఈ ఉప్పు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో గతంలో నీటి కొలనులు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ నీరు ఉందని కనుగొన్నారు.