Sustainable Flight | విమాన ప్రయాణం ఇప్పుడున్న దాని కంటే మరింత చౌకగా మార్చేందుకు నాసా-బోయింగ్లు కృష్టిచేస్తున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా తక్కువ ధరలో ప్రయాణికులను గమ్యం చేర్చే విమానం తయారీకి పూనుకున్నాయి. ఈ ప్రయత్నం విజయవంతమైతే రానున్న రోజుల్లో తక్కువ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశం దక్కనున్నది.
ఉద్గారాలను తగ్గించేందుకు సస్టైనబుల్ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్ ప్రాజెక్టులో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, విమానాల తయారీ సంస్థ బోయింగ్ కలిసి పనిచేస్తున్నాయి. ఈ పార్ట్నర్షిప్ను బుధవారం ప్రకటించారు. పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించడమే కాకుండా ఈ విమానాలు ఇంధనాన్ని కూడా ఆదా చేస్తాయని ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. తమ ప్రయోగం విజయవంతమైతే 2030 నాటికి విమానాల్లో ఈ సాంకేతికతలు అందుతాయని, ఫలితంగా ప్రయాణం చౌకగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఏడేండ్లపాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టులో నాసా దాదాపు 425 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నది. అదనంగా సాంకేతిక నైపుణ్యం, సౌకర్యాలను కూడా నాసా అందిస్తుంది.
ట్రాన్సోనిక్ ట్రస్-బ్రేస్డ్ వింగ్ కాన్సెప్ట్ విమానం అదనంగా పొడవైన సన్నని రెక్కలను కలిగి ఉండనున్నది. ఈ డిజైన్ సంప్రదాయ విమానం కంటే మరింత ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నది. వాస్తవానికి, ఈ ఆకారం తక్కువ డ్రాగ్ను సృష్టించడం ద్వారా తక్కువ ఇంధనాన్ని కాల్చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా అనేక గ్రీన్ టెక్నాలజీలను ఈ విమానం తయారీకి ఉపయోగించనున్నారు. కాగా, 2035 – 2050 మధ్య కొత్త సింగిల్-ఐసల్ విమానాల కోసం డిమాండ్ 40 వేల వరకు పెరుగుతుందని బోయింగ్ అంచనా వేస్తున్నది.