5G Speed | అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీన మొదలయ్యాయి. టెలికం దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాయి. వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీల ఫోన్లలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలికం సంస్థలు, స్మార్ట్ ఫోన్ సంస్థల్లో 5జీ డేటా స్పీడ్పై ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా ( Ookla ) అంచనా వేసింది. జియోలో అత్యధికంగా 598.58 ఎంబీపీఎస్ డేటా డౌన్లోడ్ అవుతున్నది. ఎయిర్టెల్కు వచ్చే సరికి 197.98 ఎంబీపీఎస్కు పరిమితమైందని తెలిపింది ఊక్లా. సగటున దేశంలో 5జీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం 500 ఎంబీపీఎస్గా నమోదైందని వెల్లడించింది.
భారతీ ఎయిర్టెల్.. ఎనిమిది నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసిల్లో 5జీ సేవలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు జియో 5జీ బేటా ట్రయల్స్.. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిల్లో మొదలయ్యాయి.
5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్లపై ఊక్లా జరిపిన సర్వేలో ఆపిల్ ఐఫోన్-12 మాత్రమే అత్యంత 5జీ సామర్థ్యం గల ఫోన్గా నిలిచింది. సర్వేలో పాల్గొన్న పది మందిలో ఒకరు మాత్రమే ఐఫోన్లో 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. శ్యామ్సంగ్ 31 శాతం, షియోమీ 23 శాతం, రియల్మీ, వివో తర్వాతీ స్థానాల్లో నిలిచాయి. వాణిజ్యపరంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక డేటా డౌన్లోడ్లో స్థిరత్వం వస్తుందని ఊక్లా అంచనా వేసింది.
ముంబైలో జియో 5జీ డౌన్లోడ్ వేగం 515.38 ఎంబీపీఎస్ ఉంటే, ఎయిర్టెల్ సగటున 271.07 ఎంబీపీఎస్గా నమోదైంది. కోల్కతాలో జియో 482.092 ఎంబీపీఎస్, ఎయిర్టెల్ 33.83 ఎంబీపీఎస్ డేటా డౌన్లోడ్ అవుతున్నది. వారణాసిలో మాత్రం ఎయిర్టెల్లో అత్యధికంగా 516.57 ఎంబీపీఎస్ డేటా డౌన్లోడ్ అవుతుండగా, జియోలో 485.22 ఎంబీపీఎస్ డేటా డౌన్లోడ్ అవుతున్నట్లు తేలింది.