Jio | ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ 5జీ టెలికం సేవలు అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ జియో మంగళవారం పునరుద్ఘాటించింది. `నెలల వారీగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, తాలూకాల పరిధిలో జియో 5జీ సేవలు విస్తరించాలన్న లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి తహసీల్, తాలుకా, పట్టణం పరిధిలో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి` అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్ట్-బడ్జెట్ వెబినార్లో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే శరవేగంగా 5జీ సేవలు విస్తరిస్తామని తెలిపారు. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో దేశంలో ప్రాథమికంగా 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.
ఆరు నెలల్లోనే దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి 5జీ టూల్స్ తీసుకెళ్లగలిగింది. శరవేగంగా దేశమంతా 5జీ సేవలు వ్యాపింపజేస్తున్నది. దేశంలోనే 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రక్రియలో జియో సారధ్యం వహిస్తున్నది అని ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలోని 277 నగరాల పరిధిలో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.