ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన అతిచిన్న ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్కు సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు భూస్థిర పరీక్ష నిర్వహించారు. భారత అంతరిక్ష, వాణిజ్య రంగంలో ఇస్రో చౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేస్తోంది.
చిన్న ఉప గ్రహాలను చిన్న రాకెట్లతో ఉపయోగిస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఇస్రో ఎస్ఎస్ఎల్వీకి రూపకల్పన చేసింది. 500 కిలోల బరువు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేలా దీన్ని తయారు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీలో పది శాతం ఖర్చుతో మూడు ఘన ఇంధన మోటర్లతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించారు. ఈ రాకెట్ డిజైన్ను 2018లో విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్ రూపొందించింది. ఏప్రిల్ 2022లో దీన్ని నింగిలోకి పంపనున్నారు.