న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్, మంగళ్యాన్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఈ ప్రయోగాలు పూర్తయిన అనంతరం గ్రహాలన్నింటిలో అత్యంత వేడిగా ఉంటే శుక్రగ్రహంపై ప్రయోగానికి రెడీ అవుతున్నది. సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు (వీనస్). మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం వీనస్ను పిలుస్తుంటారు. ఒకప్పుడు మన భూమ్మీద ఉండే వాతావరణమే దానిపైనా ఉండేదని, ఆ తర్వాత గ్రహం తీవ్రమైన వేడిగా మారిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో అత్యంత విషపూరితమైన గ్రహంగా ఉండగా.. అయితే, దానికి గల కారణాలు ఇప్పటి వరకు రహస్యంగానే నిలిచిపోయాయి. శుక్ర గ్రహం ఉపరితలం, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాల రహస్యాల గుట్టును విప్పేందుకు ఇస్రో ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా శాటిలైట్ను సిద్ధం చేస్తున్నది. అంతరిక్ష ఆధారిత అధ్యయనాలు, పరిశోధనలపై బుధవారం ఇస్రోలో జరిగిన చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. త్వరలోనే వీనస్ ప్రయోగం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయోగం నిర్వహించే సత్తా, సామర్థ్యం భారత్కు ఉన్నాయని, ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి వీసన్ మిషన్పై పని చేస్తున్నామన్న ఆయన.. ప్రస్తుతం ప్రణాళిక సిద్ధమైందని వివరించారు. ప్రాజెక్టు రిపోర్ట్ తయారైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కూడా సమకూరాయని చెప్పారు. అతి త్వరలోనే ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు సోమనాథ్ స్పష్టం చేశారు. అయితే, అతి త్వరలోనే వీనస్ ప్రయోగాన్ని చేపడతామన్న ఇస్రో.. అంతరిక్ష వాహకనౌక తయారీకి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఇస్రో 2024 డిసెంబర్ వరకు ప్రాజెక్ట్ లాంచ్ విండోను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.