Aditya L1 | బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవడంతో సంబరాలు చేసుకుంటున్న దేశానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఇస్రో శ్రీకారం చుట్టినట్టు తాజాగా వెల్లడించింది. వరుస చంద్రయాన్ ప్రయోగాల ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నట్టే.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేయనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్-1 సిద్ధమైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను నీలేశ్ ఎం దేశాయ్ వివరించారు.
సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేస్తున్నది. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.
రోదసిలో సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ పంపిస్తున్న తొలి అబ్జర్వేటరీ స్పేస్క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా సూర్య వ్యవస్థ గురించి ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యుడి చిత్రాలు, స్పెక్ట్రోస్కోపిపై దృష్టి సారించవచ్చు. దీని ద్వారా సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుందో మరింతగా తెలుసుకోవచ్చు.
గగన్యాన్: అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గగన్యాన్ పేరిట ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2022లోనే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా… కరోనా మహమ్మారి కారణంగా ఆలస్య అయింది. వ్యోమగాములు రష్యా సహకారంతో ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. 2025లో ఈ ప్రయోగం చేసే అవకాశం ఉంది.
శుక్రయాన్: భూమికి ఓ పక్కన ఉన్న అంగారకుడిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఇస్రో ఓ స్పేస్క్రాఫ్ట్ను పంపింది. భూమికి మరోవైపు ఉన్న శుక్రుడిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా ఓ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తున్నది.
నిసార్: భూమిని నిరంతరం పరిశీలించేందుకు నిసార్ పేరిట ఓ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనున్నది. ఇది నాసా, ఇస్రో సంయుక్తాధ్వర్యంలో జరగనున్నది. దీని సముద్ర మట్టం, భూ గర్భ జలాలు సహా భూమికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. మరోవైపు సూర్యుడి ఆవల ఉన్న ఇతర నక్షత్రాల గురించి తెలుసుకునేందుకు ఓ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందిస్తున్నది.