న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐఫోన్ లైనప్పై యాపిల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. తక్కువ ధరకే భారీ డిస్ప్లేను ఆఫర్ చేస్తూ మిని మోడల్ స్ధానంలో ప్లస్ మోడల్ను ప్రవేశపెట్టింది. అయితే ఐఫోన్ 14 ప్లస్కు కస్టమర్ల నుంచి ఆదరణ కొరవడటంతో ఈ డివైజ్ను విక్రయించడంలో యాపిల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఐఫోన్ 14 ప్లస్ అనుభవంతో యాపిల్ ఈసారి వచ్చే ఏడాది లాంఛ్ చేయనున్న ఐఫోన్ 15 ప్రొ, నాన్ ప్రొ మోడల్స్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేపట్టాలనే దానిపై కసరత్తు సాగిస్తోంది. ప్రొ, నాన్ ప్రొ మోడల్స్ మధ్య వైరుధ్యాలపై టెక్ దిగ్గజం తీవ్రంగా దృష్టిసారించింది. అందుబాటు ధరలో భారీ స్క్రీన్తో కూడిన ఫోన్ను కోరుకునే కస్టమర్లు ఐఫోన్ 15 ప్లస్ను ఎంచుకుంటారని కంపెనీ భావిస్తోంది.
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఐఫోన్ 15 ప్లస్ ధర అందుబాటులో ఉండాలని యాపిల్ యోచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ మోడల్ ప్రస్తుతం రూ. 89,900 నుంచి లభిస్తోంది. ప్లస్ మోడల్ ధరను తగ్గించాలని యాపిల్ నిర్ణయిస్తే ఐఫోన్ 15 వనిల్లా మోడల్ ధర కూడా దిగివస్తుంది. ఇక ఐఫోన్ 14 రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుండగా ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ను గణనీయంగా పెంచేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది.