iPhones-Tata | ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ భారత్లో ప్రారంభం కాబోతున్నది. ఫాక్స్కాన్, లగ్జేర్తోపాటు టాటా గ్రూప్ కూడా దేశీయంగా ఐ-ఫోన్ల తయారీలో భాగస్వామి కాబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి వెలుగు చూడనున్న ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్ మోడల్స్ను టాటా గ్రూప్ అసెంబ్లింగ్ చేయనున్నది. ఇందుకోసం ఆపిల్ నుంచి కాంట్రాక్ట్ అందుకుంటుందని సమాచారం.
ఫాక్స్ కాన్ 70 శాతం, లగ్జేర్ 25 శాతం ఐ-ఫోన్లను భారత్లో అసెంబ్లీంగ్ చేయనున్నాయి. మిగతా ఐదు శాతం టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్నది. ఐ-పోన్ 15 ప్లస్ అసెంబ్లింగ్లో కూడా టాటా గ్రూప్ 5 శాతం వాటా కలిగి ఉంటుంది. ఫాక్స్ కాన్ 60, లగ్జేర్ 35 శాతం యూనిట్లను అసెంబ్లింగ్ చేస్తాయి.
చైనా నుంచి ఐ-ఫోన్ల తయారీ ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్ భావిస్తున్నది. కార్మికుల నిరసనలు, అసెంబ్లింగ్లో సవాళ్లు, ఆలస్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి వేళ చైనాలో ఫాక్స్కాన్ అత్యధికంగా ఐ-ఫోన్లు తయారు చేసింది. కానీ, కరోనా తర్వాత చైనా ఆవల.. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నది.
2022లో ఆపిల్ దాదాపు రూ.41,200 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వచ్చే నాలుగైదు ఏండ్లలో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే తమ ఉత్పత్తుల్లో భారత్ నుంచే 25 శాతం చేయాలని ఆపిల్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
గత నవంబర్ నెలలో దేశంలో గల విస్ట్రన్ ఐ-ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ కొనుగోలు కోసం టాటా గ్రూప్ చర్చలు జరిపింది. టాటా సన్స్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్లో ఐ-ఫోన్లకు కంపొనెంట్ సరఫరాదారుగా ఉంది. విస్ట్రన్ ప్లాంట్ను టాటా గ్రూప్ ఈ నెలలో టేకోవర్ చేస్తుందని భావిస్తున్నారు. అటుపై భారత్ మార్కెట్ నుంచి విస్ట్రన్ నిష్కమిస్తుందని సమాచారం.