Infosys Ban | దేశంలోని టాప్-5 ఐటీ సంస్థల్లో ఒకటి ఇన్ఫోసిస్. కానీ ఇప్పుడు అది కొత్త రూల్ తీసుకొచ్చింది. తమ సంస్థలో పని చేసి, రాజీనామా చేసిన ఉద్యోగులు.. తర్వాత ఇతర ఐటీ సంస్థల్లో పని చేయకుండా నిషేధం విధించింది. ఒకవేళ వారు పని చేసే క్లయింట్లు.. ఇన్ఫోసిస్ క్లయింట్లయితే, ఒక ఆరు నెలల పాటు `నేమ్డ్ కాంపిటీటర్ల`తో మాజీ ఉద్యోగులు పని చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేకించి దేశంలోని టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, యాక్స్చెంజర్ సంస్థల్లో పని చేయొద్దని తెలిపింది. ఇప్పటికే రాజీనామా చేయాలనుకున్న వారు, రాజీనామాకు ప్లాన్ చేసుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు తాజా సంస్థ నిషేధంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ఫీకి రాజీనామా చేశాక.. ఇతర సంస్థలలో చేరకుండా మేనేజ్మెంట్ విధించిన నిషేధం అడ్డంకిగా మారుతుందని వాపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇన్ఫోసిస్ నిషేధం అనుచితం అని వ్యాఖ్యానించింది.
కరోనా తర్వాత ప్రతిభావంతుల కోసం ఐటీ దిగ్గజాలు పరస్పరం తమ ప్రత్యర్థి సంస్థల ఉద్యోగులపై అట్రిక్షన్ (వలస) వల విసురుతున్నాయి. ఇప్పుడు పొందుతున్న వేతన ప్యాకేజీ కంటే మెరుగైన ప్యాకేజీ అందిస్తున్నాయి. ఇన్ఫోసిస్ అట్రిక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. కొత్తగా చేరే ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్ లెటర్లోనూ ఈ నిషేధం నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది.
ఏ కారణం చేతనైనా ఇన్ఫోసిస్ నుంచి ఉద్వాసనకు గురైనా, రాజీనామా చేసినా, ఆరు నెలల పాటు ఇతర సంస్థల్లో పని చేయరాదన్న నిబంధనను అంగీకరిస్తున్నా అని పేర్కొనాలి.
ఇన్ఫోసిస్ నుంచి ఉద్వాసనకు గురైన 12 నెలల వరకు ఏ కస్టమర్ వద్ద ఉద్యోగానికి ఆఫర్ ఆమోదించబోనని తెలుపాలి. ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగిన తర్వాత ఇన్ఫోసిస్ పేర్కొన్న కాంపిటీటర్ సంస్థ నుంచి ఉద్యోగానికి ఆఫర్ అందుకోబోనని హామీ ఇవ్వాలి.
నేమ్డ్ కాంపిటీటర్స్గా పేర్కొన్న టీసీఎస్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో, ఆక్స్చేంజర్లలో ఆరు నెలలపాటు పని చేయొద్దు. ఒకవేళ ఈ సంస్థల కస్టమర్లకు రాజీనామా చేసిన ఉద్యోగులు ఇన్ఫీలో సేవలందించి ఉంటే 12 నెలల పాటు ఆ సంస్థలతో కలిసి పని చేయొద్దు.
గత మూడు నెలల్లో 80 వేల మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్కు రాజీనామా చేశారు. సంస్థలో అట్రిక్షన్ రేటు 27 శాతంగా ఉంది. ఇతర టాప్ ఐటీ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. నిరాశా నిస్పృహలతో తమ ఉద్యోగులను రాజీనామా చేయకుండా నివారించడానికి ఇన్ఫోసిస్ ఈ నిబంధన తెచ్చినట్లు తెలుస్తున్నది. ఇన్ఫీ నిషేధ నిబంధనకు వ్యతిరేకంగా కేంద్ర కార్మికశాఖ వద్ద ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని 27 సెక్షన్ ప్రకారం ఇన్ఫీ నిషేధ నిబంధన చట్ట విరుద్ధం అని ఆరోపించారు.