న్యూయార్క్ : కార్యాలయాల నుంచి పనిచేసేందుకు ఉద్యోగులు విముఖత చూపడంతో వర్క్ ఫ్రం ఆఫీస్ మోడల్ను టెక్ దిగ్గజం యాపిల్ వాయిదా వేసింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని కోరడంతో కంపెనీ మెషిన్ లెర్నింగ్ హెడ్ ఏకంగా లక్షల జీతాన్ని వదులుకుని సెర్చింజన్ దిగ్గజం గూగుల్లో చేరారు. వారానికి మూడు రోజుల పాటు వర్క్ ఫ్రం ఆఫీస్ పద్ధతికి ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఈ మోడల్ అమలును కంపెనీ వాయిదా వేసింది.
మే 23 నుంచి హైబ్రిడ్ పద్ధతిని ప్రారంభించాలని యాపిల్ తొలుత భావించగా ఆ ప్రతిపాదనపై కంపెనీ వెనక్కితగ్గింది. కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రతిపాదన అమలులో జాప్యం చేస్తున్నామని యాపిల్ చెబుతున్నా ఎప్పటి నుంచి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తారనే వివరాలనూ ఇంకా వెల్లడించలేదు. ఇక యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వర్క్ ఫ్రం హోం మోడల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటి నుంచి పనిచేయడం అన్ని ప్రయోగాలకూ తల్లి వంటిదని టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ మోడల్ రెండింటిలో మెరుగైనది గుర్తించే క్రమంలో అన్ని ప్రయోగాలకు తల్లి వంటి వర్క్ ఫ్రం హోం మోడల్ను పైలట్ ప్రాజెక్ట్గా నడుపుతున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తాను ప్రత్యక్షంగా వ్యక్తులతో భేటీనే కోరుకుంటానని, అలాగని వర్చువల్ మీటింగ్స్ ఐడియాను తోసిపుచ్చలేమని టిమ్ కుక్ న్యూయార్క్లో టైమ్ 100 సింపోజియంలో పేర్కొన్నారు.