న్యూఢిల్లీ : భవిష్యత్ బిజినెస్ లీడర్లను సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలతో సంసిద్ధం చేసే లక్ష్యంతో డేటా సైన్స్, కృత్రిమ మేథ (ఏఐ)లో ఎంబీఏ ప్రోగ్రాంను ఐఐటీ మండి ప్రారంభిస్తోంది. ఈ ఏడాది చివరి నుంచి రెండేండ్ల ఫుల్టైమ్ మాస్టర్ ప్రోగ్రామ్ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. యాజమాన్య నిర్వహణలో దీటైన నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, విస్తృత డేటా సైన్స్ టూల్స్లో నైపుణ్యం, సాఫ్ట్స్కిల్స్లో అభ్యర్ధులకు తర్ఫీదు ఇచ్చే దిశగా ఎంబీఏ ప్రోగ్రాంను ఐఐటీ మండి డిజైన్ చేస్తోంది.
ఇతర బీటెక్, ఎంటెక్, ఎంఎస్ల కంటే భిన్నంగా ఈ ఎంబీఏ ప్రోగ్రాం డేటా సైన్స్, కృత్రిమ మేథలను పలు వ్యాపార, నిర్వహణ రంగాల్లో ఎలా మేళవించాలనే దానిపై లోతైన అవగాహనను కల్పిస్తుంది. పరిశ్రమ, బోధనా రంగ సవాళ్లను ఎదుర్కొనేలా భవిష్యత్ బిజినెస్ లీడర్లను తయారు చేసే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను ప్రారంభించామని ఐఐటీ మండి డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా తెలిపారు.
మెరుగైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో డేటా ట్రాన్స్ఫాంను సమర్ధంగా నిర్వహించేలా ఈ ప్రోగ్రాం విద్యార్ధులకు ఉపకరిస్తుందని అన్నారు. డేటా సైన్స్, ఏఐని ఏ వ్యాపారంలో విలువ జోడించేందుకు ఉపయోగించవచ్చనేది వారికి ఈ ప్రోగ్రాంతో అవగతమవుతుందని పేర్కొన్నారు. ప్లస్ 2 స్ధాయిలో మ్యాథ్స్ను అభ్యసించిన అండర్ గ్రాడ్యుయేట్లు అందరికీ డేటా సైన్స్, ఏఐలో ఎంబీఏ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుందని చెప్పారు.