ఆర్యభట్ట మొదలు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వరకు ప్రపంచ చరిత్రలోనే ఎంతో మంది మేధావులకు పుట్టినిల్లుగా భారత్ విలసిల్లుతున్నది. పేరెన్నికగన్న లక్ష్మీపుత్రులు రతన్టాటా, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ తదితరులు ఉన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. విదేశాల్లో ఉన్న సంస్థలకు సారధ్యం వహిస్తున్న వారికి కూడా పద్మ అవార్డులు లభించాయి.
మైక్రోసాఫ్ట్ సీఈవోగా పని చేస్తున్న భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్లకు పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. సీడీఎస్ బిపిన్ రావత్కు మరణం తర్వాత పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ పూర్తి పేరు పిచ్చాయ్ సుందరరాజన్ అలిఆయస్ సుందర్ పిచ్చాయ్. 2004లో గూగుల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా కెరీర్ ప్రారంభించారు సుందర్ పిచ్చాయ్.
తొలుత బిజినెస్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా చేరినా తర్వాతీ కాలంలో గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్జెయ్ బ్రిన్ స్థానంలో ప్రస్తుతం గూగుల్ & ఆల్ఫాబెట్ సీఈవోగా సేవలందిస్తున్నారు. మదురైలో జన్మించిన సుందర్ పిచ్చాయ్.. ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అటుపై కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.
పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సత్య నాదెళ్ల.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. 2014 ఫిబ్రవరి నుంచి గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా పని చేస్తున్నారు. గతేడాది ఆయనను మైక్రోసాఫ్ట్.. సంస్థ చైర్మన్గా నియమించింది. కర్ణాటకలో బీటెక్ పూర్తి చేసిన సత్యనాదెళ్ల.. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సెస్లో ఎంఎస్ చదివారు. తెలుగు తేజం సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్లో చేరడానికి ముందు సన్ మైక్రో సిస్టమ్స్లో పని చేశారు.