న్యూయార్క్ : ట్విట్టర్ను టేకోవర్ చేసిన వెంటనే మైక్రోబ్లాగింగ్ సైట్ నయా బాస్ ఎలన్ మస్క్ సగం మంది ఉద్యోగులపై వేటు వేసి కలకలం రేపారు. లేఆఫ్స్ ప్రక్రియలో 90 శాతం మంది ట్విట్టర్ ఇండియా ఉద్యోగులను ఇంటికి పంపిన ఆయన తాజాగా భారత్లో ట్విట్టర్ యాప్ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, ఇండోనేషియా సహా పలు ప్రాంతాల్లో ట్విట్టర్ యాప్ చాలా స్లోగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పలు దేశాల్లో ట్విట్టర్ యాప్ చాలా స్లోగా ఉందని, ఇందుకు యాజర్లకు తాను క్షమాపణ చెబుతున్నానని మస్క్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తనతో పాటు తమ టీం కసరత్తు సాగిస్తోందని మస్క్ తన లేటెస్ట్ ట్వీట్స్లో వివరించారు.
అమెరికాలో ట్విట్టర్ 2 సెకండ్లలో రిఫ్రెష్ అవుతుండగా, భారత్లో ఇందుకు 10 నుంచి 20 సెకండ్ల సమయం పడుతున్నదని చెప్పారు. మరికొన్ని చోట్ల ట్విట్టర్ రిఫ్రెష్ అయ్యేందుకు ఏకంగా 30 సెకండ్లు పడుతున్నదని పేర్కొన్నారు. బ్యాడ్ బ్యాచింగ్ కారణంగా యాప్ స్లోడౌన్ జరుగుతున్నదని బిలియనీర్ చెప్పుకొచ్చారు. యాప్ బ్యాండ్విడ్త్ వల్ల ఎంత జాప్యం జరుగుతున్నదనేది గుర్తించాలని మస్క్ తాజా ట్వీట్లలో పేర్కొన్నారు. ఇక ట్విట్టర్ ఉద్యోగులు ఆఫీసులకు తిరిగివచ్చి వారానికి 40 గంటలు పనిచేయాలని కోరారు.