న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గం అనుసరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫిషింగ్(స్మిషింగ్) ద్వారా ప్రలోభపెట్టే ఎస్ఎంఎస్లను పంపించి, ముఖ్యమైన సమాచారాన్ని చెప్పాలని లేదా సొమ్మును బదిలీ చేయాలని బ్యాంకు ఖాతాదారులను అడుగుతున్నారు.
ఎలా మోసం చేస్తారు?
సైబర్ నేరగాళ్లు ఓ మొబైల్ నంబరు నుంచి బ్యాంకు ఖాతాదారుకు ‘మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము క్రెడిట్ చేశా’మంటూ ఎస్ఎంఎస్ పంపిస్తారు. బ్యాంకులు పంపించే ఎస్ఎంఎస్ల మాదిరిగానే ఈ ఎస్ఎంఎస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఖాతాదారుకు ఫోన్ చేస్తారు. పొరపాటున మీ ఖాతాలో సొమ్ము జమ చేశామని చెబుతారు. ఆ సొమ్మును ఓ యూపీఐ నంబరుకు తిరిగి పంపించాలని కోరతారు.
అయితే బ్యాంకులు పంపించే ఎస్ఎంఎస్లు మొబైల్ నంబరు నుంచి రావనే సంగతిని గుర్తు చేసుకోవాలి. ఇటువంటి ఎస్ఎంఎస్లతోపాటు మాల్వేర్ను కూడా పంపించి, డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఖాతాదారును ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు మాయదారి లింకులను కూడా పెట్టవచ్చు.
అధికారిక ఎస్ఎంఎస్ ఎలా ఉంటుంది?
బ్యాంకులు పంపించే ఎస్ఎంఎస్లపైన ఆరు క్యారెక్టర్లతో ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీబీకే, ఐసీఐసీఐబీ వంటి కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కేవలం అంకెలతో ఉండదు. ఉదాహరణకు, 567687, 808080 వంటివి ఉండవు. మోసగాళ్లు తరచూ వ్యక్తిగత మొబైల్ నంబర్ల ద్వారానే ఎస్ఎంఎస్లను పంపిస్తారు.
మోసపూరిత ఎస్ఎంఎస్ వస్తే ఏం చేయాలి?
సైబర్ నేరగాళ్లు పంపిన సమాచారాన్ని నిశితంగా పరిశీలించాలి. సంయమనంతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలి.