Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్మీడియా ఫ్లాట్ఫామ్స్లో బిజినెస్ ప్రమోషన్ల పేర్లతో సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. సైబర్నేరగాళ్లు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సింపుల్గా మహిళలనే లక్ష్యంగా చేసుకొని చిన్న మొత్తాలలో దోపిడీ చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఎక్కువ మందిని మోసాలు చేస్తుండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఇదే సైబర్నేరగాళ్లకు కలిస్తోంది.
ప్రస్తుతం ఏ వ్యాపార ప్రకటనలకైనా సోషల్ మీడియానే పదునైన ఆయుధం. రోడ్డుపై బండి నడిపే వారి నుంచి కార్పొరేట్ వ్యాపారాల వరకు ఇదే సూత్రం. దీనినే ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, బట్టలు, గృహాపకరణాలు విక్రయిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు. ఆయా ప్రకటనల కింద ఫోన్ నెంబర్, గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు ఇస్తూ కేవలం వాట్సాప్ కాల్స్లోనే మాట్లాడుతున్నారు. తక్కువ ధరకు ఇంటికి వస్తువులు డెలివరీ చేస్తామనగానే చాలా మంది మహిళలు రూ.500, రూ.1000, రూ.1500 చెల్లిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తరువాత ఆయా వస్తువులు ఇంటికి రావడం లేదు. దీంతో తాము మోసపోయామని గుర్తిస్తున్నారు.
కొందరు వాట్సాప్లో మాట్లాడుతూనే రేపు ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంకొందరు మీరు కోరిన వస్తువు పంపించలేకపోతున్నాం..మీ డబ్బులో సగం తిరిగి పంపిస్తున్నామని మరో సగం నొక్కేస్తున్నారు. ఇలా చిన్న మొత్తాలలో ఒక్కొక్కరు మోసపోతుండడంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. కానీ చిన్నమొత్తంలో ఎక్కువ మందిని లూటీ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలతో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి వస్తువులను తీసుకోవడం మంచిదని, అలాంటప్పుడే ఏదైనా పొరపాటు జరిగినా దుకాణదారుడిని ప్రశ్నించేందుకు అవకాశముంటుందని సూచిస్తున్నారు.