‘కెరీర్ ఆరంభంలోనే నటనకు ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలు నాకు లభిస్తున్నాయి. హార్డ్వర్క్తో పాటు అదృష్టం కలిసిరావడం వల్లే మంచి సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి’ అని చెప్పింది అనన్య నాగళ్ల. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వకీల్సాబ్’. పవన్కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్వేణు దర్శకుడు. దిల్రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా అనన్య చెప్పిన సంగతులివి..
అమాయకురాలైన సున్నిత మనస్తత్వమున్న అమ్మాయిగా ఈ సినిమాలో కనిపిస్తా. నేను నటించిన ‘మల్లేశం’ సినిమా చూసి దర్శకుడు శ్రీరామ్వేణు అవకాశమిచ్చారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నా. ఆ ఆలోచనతోనే తొలుత పవన్కల్యాణ్ సినిమాలో అవకాశం అనగానే చాలా రోజులు నమ్మలేదు. కల అనుకున్నా. షూటింగ్ ప్రారంభమయ్యేవరకు సినిమాలో నేను నటించేది అనుమానమే అనిపించింది. నా కల నిజమవ్వడం ఆనందంగా ఉంది.
నమ్మకాన్నిచ్చిన సినిమా..
తెలుగు అమ్మాయిలు టాలీవుడ్లో రాణించడం కష్టమనే అపోహ చాలా మందిలో ఉంది. ఇతర భాషల్లో ప్రతిభను నిరూపించుకున్న తర్వాతే తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నించడం ఉత్తమమనే భావనతో చాలా మంది ఉన్నారు. ప్రతిభ, పట్టుదలతో ప్రయత్నిస్తే స్టార్ హీరోల సినిమాల్లో తెలుగు అమ్మాయిలు నటించవొచ్చని ‘వకీల్సాబ్’నిరూపించింది.
మరచిపోలేని జ్ఞాపకాలు..
షూటింగ్ మొదలైన తొలినాళ్లలో పవన్కల్యాణ్తో మాట్లాడటానికి భయపడ్డా. నేను కంఫర్ట్గా ఫీలవ్వడం లేదని పవన్ గుర్తించారు. ‘మల్లేశం’ సినిమా విశేషాలతో పాటు నా చదువు, వ్యక్తిగతజీవితం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాటలతో నాలోని భయం పోయింది. సెట్స్లో మా ఇద్దరి మధ్య మహిళాసాధికారతతో పాటు పలు సామాజిక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. అవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.రెండుమూడేళ్లు గ్లామర్ పాత్రలు చేసిన తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం రెండు సినిమాల్ని అంగీకరించా.