న్యూఢిల్లీ : వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవల 3500 మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్పై దృష్టి సారించింది. జనరేటివ్ ఏఐ టూల్స్పై పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో రవి కుమార్ నిర్ధారించారు. ఆర్ధిక మందగమనంతో సంక్లిష్ట పరిస్ధితుల నేపధ్యంలో కొన్ని కార్యాలయాల సముదాయాలను మూసివేయనున్నట్టు కూడా కాగ్నిజెంట్ పేర్కొంది.
కన్సల్టింగ్, డిజైన్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో తమ ఉద్యోగుల పనిని వేగవంతం చేసేందుకు న్యూ టెక్నాలజీ జనరేటివ్ ఏఐను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నామని కాగ్నిజెంట్ సీఈవో తెలిపారు. ఈ టెక్నాలజీతో ఉద్యోగుల ఉత్పాదకత రెట్టింపవుతుందని కాగ్నిజెంట్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తమ క్లయింట్ల బిజినెస్లను మార్చడంతో పాటు తమ ఉత్పాదకతను జనరేటివ్ ఏఐ టూల్ మెరుగుపరుస్తుందని రవికుమార్ పేర్కొన్నారు.
జనరేటివ్ ఏఐ టూల్ అభివృద్ధి కోసం తాము పెద్దమొత్తం వెచ్చిస్తామని చెప్పారు. ఏఐ యాక్సిలరేటర్ పేరుతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళతామన్నారు. మరోవైపు చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్తో కొలువుల కోతతో పాటు టెక్నాలజీ దుర్వినియోగంపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ టూల్స్తో ముంచుకొచ్చే ముప్పును నివారించడంతో పాటు ప్రజాబాహుళ్యంలోకి ఏఐ టూల్స్ వెళ్లే ముందు వీటిలోని లోపాలను సవరించాలని, సమస్యలను అధిగమించాలని టెక్ దిగ్గజాలతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు.
Read More