Lay-Offs | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు.. టెక్నాలజీ నిపుణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వివిధ టెక్ దిగ్గజాలు పొదుపు చర్యల పేరిట భారీగా ఉద్యోగాల కోత విధిస్తుండటంతో అగమ్య గోచరంగా మారిన తమ భవిష్యత్పై సాఫ్ట్వేర్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత నెలలో దాదాపు లక్ష మంది ఐటీ రంగ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ఫోర్స్ తదితర కంపెనీలు గత నెలలో ఉద్యోగులను ఇండ్లకు పంపిన వాటిలో ప్రధాన సంస్థలు. ప్రపంచవ్యాప్తంగా 288కి పైగా కంపెనీల్లో ప్రతి రోజూ 3,330 మందికి పైగా టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఆపిల్ మినహా ప్రతి అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇస్తున్నాయి. అమెజాన్ 18 వేల మంది, గూగుల్ 12 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులకు గత నెలలో పింక్ స్లిప్లు అంద జేశాయి. ఇక సేల్స్ ఫోర్స్ ఏడు వేల మంది, ఐబీఎం 3,900, ఎస్ఏపీ 3000 మందిని జనవరిలో ఇండ్లకు పంపేశాయి.
గతేడాది 1000కి పైగా టెక్ సంస్థలు 1,54,336 మంది నిపుణులకు ఉద్వాసన పలికాయని లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ (Layoffs.fyi) డేటా చెబుతున్నది. 2022 నుంచి ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా మహమ్మారితో తలెత్తిన మొదలైన ఇబ్బందులు సుదీర్ఘంగా కొనసాగి.. సూక్ష్మ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి, అవసరాన్ని మించి నియామకాలు.. తదితర అంశాలు భారీగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల ఉద్వాసనకు దిగడానికి కారణాలుగా తెలుస్తున్నది.
11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన తర్వాత మెటా ఫౌండర్ అండ్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. శక్తిమంతమైన సంవత్సరంగా 2023గా ఉండాలని కోరుకుంటున్నట్లు జుకర్బర్గ్ తెలిపారు. ఇక సామూహిక ఉద్యోగుల ఉద్వాసన పలికిన సంస్థల జాబితాలో ఓఎల్ఎక్స్ గ్రూప్ కూడా చేరింది. తన సిబ్బందిలో 15 శాతం మందిని తొలగించింది ఓఎల్ఎక్స్ గ్రూప్. అంటే 1500 మందికి పైగా ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఎడ్యు మేజర్ బైజూస్ కూడా తమ ఇంజినీరింగ్ టీమ్స్లో మరో 15 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. దీని ప్రకారం బైజూస్లో 1000 మందికి పైగా కొలువులు కోల్పోనున్నారని తెలుస్తున్నది.