హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వచ్చే జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్ – 3తోపాటు ఆదిత్య ఎల్1 (Aditya L1) ప్రయోగాన్ని సైతం చేపట్టనుంది. చంద్రయాన్ 3 అనేది చంద్రుడి మీద ఇస్రో ప్రయోగించబోయే మూడవ మిషన్. ఆదిత్య ఎల్ 1 సూర్యుడి సంబంధిత పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించబోయే మొదటి మిషన్. ఈ రెండు ప్రయోగాలను వచ్చే జులై మొదటి వారంలో చేపట్టనున్నారు.
2019లో చంద్రయాన్ 2ని ప్రయోగించారు. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. చంద్రుడి ఉపరితలం మీద దిగేటప్పుడు ల్యాండర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం ఫెయిల్ అయింది. అయితే చంద్రయాన్ 2లో మాదిరిగానే చంద్రయాన్ 3లో కూడా ల్యాండర్, రోవర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయోగంలో చంద్రుడి కక్ష్యలోకి వాహకనౌకను పంపనున్నారు. చంద్రయాన్ 3లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగి రసాయనిక విశ్లేషణ చేయనుంది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా భానుడిపై చేపడుతున్న ప్రోగ్రాం ఆదిత్య ఎల్1. ఇది సూర్యుడిపై ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగం. ఆదిత్య ఎల్1ను సూర్యుడి కక్ష్యలో ఎల్1 పాయింట్ చుట్టూ భూమికి సూర్యుడికి మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఫలితంగా సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు, భారత్పై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం సులభమవుతుంది.