Chandrayaan-3 | మనుషులు ఇక ఎంచక్కా చందమామపైనే ఊయల కట్టుకొని ఊగుతూ పాడుకొనే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయని మన చంద్రయాన్-3 ఆశలు కల్పిస్తున్నది. మొన్న జాబిల్లిపై మానవ నివాసానికి అవసరమైన ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్.. తాజాగా ప్రాణకోటికి జీవాధారమైన ఆక్సిజన్ను గుర్తించింది. సల్ఫర్సహా 7 మూలకాలను గుర్తించినట్టు ఇస్రో మంగళవారం సంచలన ప్రకటన చేసింది.
బెంగళూరు, ఆగస్టు 29: చంద్రయాన్-3 ద్వారా చందమామ గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై గుర్తించింది. దీంతో శాస్త్రప్రపంచం సంబురాలు చేసుకొంటున్నది. ఆక్సిజన్తోపాటు అల్యూమినియం (ఏఎల్), సల్ఫర్ (ఎస్) కాల్షియం (సీఏ), ఫెర్రస్ (ఎఫ్ఈ.. ఇనుము), క్రోమియం (సీఆర్), టైటానియం (టీఐ), మాంగనీస్ (ఎంఎన్), సిలికాన్ (ఎస్ఐ)ను కూడా గుర్తించినట్టు ప్రకటించింది. అతి ప్రధానమైన హైడ్రోజన్ కోసం రోవర్ వేట సాగిస్తున్నట్టు వెల్లడించింది. ఇస్రో ప్రకటనతో సాంకేతికతలో మనకంటే ఎంతో ముందున్న అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), జపాన్ వంటి దేశాలు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. చంద్రుడిపై ఉష్ణోగ్రతల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ ఇప్పటికే భూమిపైకి పంపింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండగా, ఉపరితలం నుంచి ఒక అడుగు లోతులో మైనస్ 10 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది.
మనిషి నివాసానికి కావాల్సినవన్నీ గుర్తింపు
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయ్యింది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులవుతున్నారు. అందుకు కారణం కూడా ఉన్నది. భవిష్యత్తులో సుదూర ఖగోళ యాత్రల కోసం చంద్రుడిని ఒక మజిలీగా వాడుకోవాలని చాలాదేశాలు ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు ప్రజ్ఞాన్ గుర్తించిన మూలకాల్లో ఆక్సిజన్ కూడా ఉండటం, ఉపరితలానికి అడుగు లోపలే చల్లని వాతావరణం ఉండటంతో శాస్త్రవేత్తలకు కొత్త ఆశలు చిగురించాయి. సమీప భవిష్యత్తులోనే చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుచేసుకొనే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రోవర్ హైడ్రోజన్ను కూడా గుర్తిస్తే.. భూమి నుంచి వెళ్లే రాకెట్లకు ఇంధన సమస్య కూడా తీరిపోతుంది. పునర్వినియోగ రాకెట్లను తీసుకెళ్లి చంద్రుడిపైనే ఇంధనం నింపుకొని మరో గ్రహానికి ప్రయాణం చేయటానికి, లేదా భూమికి తిరిగి రావటానికి చాలా తేలిక అవుతుంది. ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా చంద్రుడిపై శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకొనేందుకు రోవర్ గుర్తించిన అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇక ఐఎస్ఎస్తో పని లేనట్టే..
ప్రస్తుతం వ్యోమగాములు స్పేస్లో ఏవైనా ప్రయోగాలు చేయాలంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో కొంతకాలం ఉంటున్నారు. అక్కడ ఎక్కువ కాలం ఉండటం చాలా కష్టం. వ్యోమగాములకు తిండి నుంచి వైద్యం వరకు ఏ అవసరం వచ్చినా భూమినుంచే పనిగట్టుకొని తీసుకెళ్లాలి. ప్రజ్ఞాన్ రోవర్ పుణ్యమా అని ఆ సమస్య తీరబోతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అనేక భిన్నమైన మూలకాలను గుర్తించినందున మనిషికి అవసరమైన నిత్యావసరాలతోపాటు ఇంధనాన్ని కూడా అక్కడే తయారుచేసుకోవచ్చని చెప్తున్నారు. అంటే.. అతి త్వరలోనే మనిషి చందమామపై మంచమేసుకొని పడుకొని నీలిరంగులో మెరిసిపోయే భూమిని చూస్తూ హాయిగా గడిపేయొచ్చన్నమాట.