Chandrayaan-3 | బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సోమవారం అర్ధరాత్రి 12-1 గంటల మధ్య వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్(టీఎల్ఐ) ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. ఇందుకోసం వ్యోమనౌక ఇంజిన్ వేగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు.
సాధారణంగా టీఎల్ఐ ప్రక్రియలో రసాయన రాకెట్ ఇంజిన్లో నిర్దిష్ట పదార్థాలను మండిస్తారు. ఇది వ్యోమ నౌక వేగాన్ని పెంచుతుంది. ఈ వేగం వ్యోమ నౌక ప్రయాణించే కక్ష్యను అసాధారణ స్థాయికి తీసుకెళుతుంది. టీఎల్ఐ ప్రక్రియ నిర్దిష్ట సమయంలోగా పూర్తి కావాల్సి ఉంటుంది. దీని ద్వారా వ్యోమ నౌక ఇతర గ్రహాలకు భూమి దూరంగా ఉండే స్థానానికి చేరుతుంది. తర్వాత హైపర్బోలిక్ విధానంలో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే చంద్రయాన్-3 వ్యోమ నౌక అయిదు కక్ష్యల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత వ్యోమ నౌక నుంచి ల్యాండర్ విడిపోవడం, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడం వంటి కీలక ఘట్టాలు జరుగుతాయి.