Moon | చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడైంది. భారత్ పంపించిన చంద్రయాన్-1 కూడా జాబిల్లిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కానీ వాతావరణమే లేని చందమామపై నీరు ఎలా ఏర్పడిందనేది చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. అయితే ఎలాగైనా చంద్రుడి గుట్టు విప్పాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ వల్లనే జాబిల్లిపైకి నీళ్లు వచ్చాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ సేకరించిన డేటాను విశ్లేషించిన హవాయి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్చిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ క్రియలను భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ ప్రోత్సహించి ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ప్రోటాన్ల వంటి అధిక శక్తి ఉండే అణువులు ఉండే సౌరగాలి.. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినప్పుడు నీరు ఏర్పడవచ్చని గతంలో పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే భూ అయస్కాంత వాతావరణంగుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సౌరగాలి చంద్రుడి ఉపరితలాన్ని తాకడం చాలా కష్టం. అలాంటి సమయంలో చంద్రుడిపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవాలని అమెరికాలోని మనోవాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే 2008లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ పంపించిన డేటాను విశ్లేషించింది. చంద్రయాన్-1 మిషన్లోని ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అయిన మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను అధ్యయనం చేయగా.. భూ అయస్కాంత వాతావరణంలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా చంద్రుడిపై నీరు ఏర్పడినట్లు తెలిసింది. అంటే సౌరగాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే.. భూవాతావరణంలోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ద్వారా కూడా నీటి అణువులు ఏరడ్డాయని గుర్తించారు.