న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తున్నదనే సంకేతాలతో టెక్ దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. గూగుల్ నుంచి టెక్ స్టార్టప్ల వరకూ యాపిల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ టెక్ దిగ్గజాలు ఖర్చులకు కళ్లెం వేస్తున్నాయి. ఉద్యోగులను సాగనంపుతూ నిర్వహణ వ్యయాలకు కోత విధిస్తున్నాయి. ఇక టెక్ స్టార్టప్ బైజూస్ కొలువుల కోత ప్రకటించింది. కంపెనీ వ్యయాల తగ్గింపు, నిర్వహణ వ్యయానికి కళ్లెం వేసే క్రమంలో 2500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు బైజూస్ ప్రకటించింది. 50,000 మంది ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రోడక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ సహా అన్ని విభాగాల్లో దశలవారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది.
కఠిన నిర్ణయం తీసుకున్న క్రమంలో ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని మన్నించాలని బైజూస్ సీఈఓ బైజూ రవీంద్రన్ సిబ్బందికి పంపిన ఈమెయిల్లో కోరారు. ఈ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేసేందుకు తాము బాధిత టీం సభ్యులకు సహానుభూతితో తెలియచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సంస్ధ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి మించి లేఆఫ్స్ ఉండవని అన్నారు.
కంపెనీని కాపాడుకునేందుకు సంక్లిష్ట పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బైజూస్ సీఈఓ పేర్కొన్నారు. ఈ ఏడాది పలు స్ధూల ఆర్ధిక అంశాలు వ్యాపార రూపురేఖలపై ప్రతికూల ప్రభావం చూపాయని చెప్పారు. ఈ పరిస్ధితుల్లో బైజూస్ సహా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు దీర్ఘకాలం మనగలిగేందుకు నిలకడగా ముందుకు సాగడంపై దృష్టి సారించాయని అన్నారు.