Byjus | ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ దాదాపు 2,500 మంది ఉద్యోగులను సాగనంపింది. దీంతో బలవంతంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిందంటూ బైజూస్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా సంస్థ ఫౌండర్, సీఈవో రవీంద్రన్.. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. స్థిరత్వం, లాభాలపై దృష్టి సారించామన్నారు. పరిస్థితుల ప్రభావంతో తొలగింపు తప్పలేదన్నారు. గతంలో సంస్థ వేగంగా అభివృద్ధి సాధించడానికి భారీగా ఉద్యోగులను తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ.. 2022లో తలెత్తిన పలు పరిస్థితులు వ్యాపార స్వరూపాన్ని, స్వభావాన్నే మార్చేశాయని, బైజూస్ అందుకు మినహాయింపు కాదన్నారు.
సంస్థ పనితీరును, సిబ్బందిని హేతుబద్ధీకరించడానికి ఐదు శాతం మంది ఉద్యోగులను అంటే సుమారు 2,500 మంది సిబ్బందిని తొలగించక తప్పలేదన్నారు. తమ సంస్థను వదిలి వెళ్లిన వారికి క్షమాపణ చెబుతున్నట్లు రవీంద్రన్ చెప్పారు. సిబ్బంది విధుల డూప్లికేషన్ను నివారించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సంస్థ లాభాలు గడించి, స్థిరత్వం సాధించిన తర్వాత.. ఉద్వాసనకు గురైన సిబ్బందికి భాగస్వామ్యం కల్పించడమే తమ తొలి ప్రాధాన్యం అని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యోగాల్లో ఉద్వాసనకు గురైన వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు.
రోల్ డూప్లికేషన్లను నివారించడంలో భాగంగా ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రవీంద్రన్ తెలిపారు. ఉద్యోగాలను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. కంపెనీ లాభాల్లోకి వచ్చి స్థిరత్వం సాధించాక.. తొలగించిన ఉద్యోగులను కంపెనీలో భాగస్వామ్యం చేసుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తమ మానవ వనరుల విభాగానికి సైతం తెలియజేసినట్లు చెప్పారు. కొత్తగా సృష్టించే ఏ పోస్ట్కైనా తొలగించిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.