టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏదైనా ఐఫోన్ రిపేర్ లేదా రిప్లేస్మెంట్ కోసం వస్తే.. సర్వీస్ సెంటర్ ఉద్యోగులు ముందుగా సదరు ఐఫోన్ పోయిందని కానీ, లేదంటే దొగతనానికి గురైందని కానీ కేసు ఉందేమో చెక్ చేయాల్సి ఉంటుందని తెలిపిందట.
ఒక వేళ అలాంటి కేసు ఏదైనా ఉంటే ఫోన్ను రిపేర్ చేయడం కానీ, రిప్లేస్ చేయడం కానీ చేయవద్దంటూ ఒక అంతర్గత మెమో పంపినట్లు సమాచారం. దీనికోసం ఏదైనా ఐఫోన్ రిపేర్ లేదా రిప్లేస్మెంట్ కోసం యాపిల్ స్టోర్కు తీసుకొస్తే.. జీఎస్ఎమ్ఏ డివైజ్ రిజిస్ట్రీ డేటాబేస్లో ఆ ఫోన్ వివరాలు చెక్ చేయాలి. ఆ మొబైల్ కనుక పోయిందని గానీ, దొంగిలించారని గానీ రిపోర్టు చేసి ఉంటే దాన్ని ఇక రిపేర్ చేయబోరట.
ఈ విషయంలో యాపిల్ సర్వీస్ సెంటర్లు, ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లకు అలర్ట్లు వచ్చే విధంగా యాపిల్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏదైనా ఐఫోన్ లేదా మరేదైనా యాపిల్ ఉత్పత్తిని సర్వీస్ సెంటర్లు వెంటనే రిపేర్ చేయడం లేదు. సదరు వస్తువల్లో ‘ఫైండ్ మై ఐఫోన్’ ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటే.. వాటిని రిపేర్ చేయడం లేదు. ఇకపై కూడా ఈ రూల్ వర్తిస్తుందని, దీంతోపాటు డేటాబేస్ కూడా చెక్ చేస్తారని సమాచారం.