న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం యాపిల్ (Apple) వచ్చే నెలలో భారత్లో తన తొలి రిటైల్ స్టోర్ను ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబైల్లో ఆఫ్లైన్ స్టోర్స్ ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (బాంద్రా ఈస్ట్)లో ఏప్రిల్లో తొలి స్టోర్ను యాపిల్ ప్రారంభించనుండగా ఆపై ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్ (సాకేత్)లో రెండవ స్టోర్ను ఏప్రిల్ నుంచి జూన్ లోగా ప్రారంభించనుంది.
ముంబైలో యాపిల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ స్టోర్ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుతీరనుంది. రెండు స్టోర్ల నిర్మాణ పనులు దాదాపు తుది దశలో ఉన్నాయని సమాచారం. ముంబైలో జరిగే స్టోర్ లాంఛ్ ఈవెంట్కు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్, పీపుల్) డెడ్రే ఒబ్రెయిన్ హాజరు కానున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరవుతారా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. కుక్ పలు సందర్భాల్లో భారత్ను సందర్శించగా 2016లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇక యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో భారత్లో పలు ప్రాంతాల్లో యాపిల్ రిటైల్ స్టోర్స్లో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటన కనిపిస్తోంది. టెక్నికల్ స్పెషలిస్టులు, ఆపరేన్ నిపుణులు, స్టోర్ మేనేజర్లు సహా పలు పొజిషన్స్ను కంపెనీ ఆహ్వానించింది.
Read More :