ప్రస్తుతం చాలా మంది యాపిల్ ఐఫోన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు చార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్తోపాటే లభించేవి. తర్వాత్తర్వాత మొబైల్ బాక్సు నుంచి ఇయర్ ఫోన్స్ మాయమయ్యాయి. ఇలాంటి సమయంలో 2020 నుంచి తాము విడుదల చేసే ఉత్పత్తులకు చార్జర్ను కూడా జత చేయడం లేదని యాపిల్ ప్రకటించింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆ కంపెనీ పట్టించుకోలేదు. ఈ క్రమంబోన బ్రెజిల్కు చెందిన ఒక వ్యక్తి తాజాగా ఐఫోన్ కొన్నాడు. తన మొబైల్తోపాటు చార్జర్ అందకపోవడంతో కోర్టుకెక్కాడు. దీనిపై గోలాస్ స్టేట్కు చెందిన స్థానిక జడ్జి వాండర్లే కైరెస్ పిన్హేరో విచారణ జరిపారు. ఈ కేసులో యాపిల్ కంపెనీని తప్పుబట్టిన ఆయన.. స్థానిక వినియోగదారుల చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని మండిపడ్డారు.
ఐఫోన్ వాడకానికి అత్యవసరమైన చార్జర్ లేకుండా ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. అలాగే సదరు వినియోగదారుడికి 5 వేల రీస్ (సుమారు 1080 డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని యాపిల్ను ఆదేశించారు. అయితే పర్యావరణ హితం కోసమే చార్జర్, ఇయర్ ఫోన్స్ వంటి ఉత్పత్తులను ఆ ప్యాకేజీ నుంచి తొలగించామనే కంపెనీ వాదనను ఆయన తప్పుబట్టారు. నిజంగా పర్యావరణ హితం కోసమైతే అసలు ఆ వస్తువులను ఉత్పత్తి చేయకూడదని,
అంతేకానీ ఉత్పత్తి చేసి వేరుగా అమ్మడం వల్ల పర్యావరణానికి ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. అంతేకాదు, ఐఫోన్లో ఉండే చార్జర్ పిన్ ప్రత్యేకం కాదని, ఏ ఇతర కంపెనీకి చెందిన చార్జర్తో అయినా మొబైల్ చార్జింగ్ పెట్టుకోవచ్చనే కంపెనీ వాదనను తిరస్కరించారు. యాపిల్ ఫోన్లు ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉన్నాయని, అలాంటప్పుడు సాధారణ చార్జర్లతో ఎలా చార్జింగ్ పెడతారని అడిగారు. కోర్టు నిర్ణయంపై మాట్లాడటానికి కంపెనీ ప్రతినిధులు తిరస్కరించారు.