కొవిడ్-19(Covid-19) సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు తమ ప్లాన్లను రీచార్జి చేయించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్(Bharti Airtel) తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహమ్మారి సమయంలో తమ నెట్వర్క్ కనెక్టివిటీని కొనసాగించేలా తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల మంది కస్టమర్ల( customers )కు ఉచితంగా 49 రూపాయల ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ఆదివారం ప్రకంటించింది.
కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు 270 కోట్ల విలువైన ప్రయోజనాలు ఉపయోగపడతాయని టెలికం కంపెనీ పేర్కొంది. దీనికి అదనంగా రూ.79 రీచార్జ్ కూపన్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. రెండు బెనిఫిట్స్ కూడా రాబోయే వారంలో ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.
మొత్తంగా 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కొత్త పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా కొవిడ్-19 సహాయక కార్యక్రమాలను కూడా రూపొందించింది.
‘తక్కువ ఇన్కమ్ కలిగిన 55 మిలియన్ల మంది కస్టమర్లకు 49 రీచార్జ్ ప్యాక్ ఉచితంగా ఇస్తున్నాం.
ఈ ప్లాన్ ద్వారా 28రోజుల వ్యాలిడిటీతో 38 రూపాయల టాక్టైమ్, 100ఎంబీ డేటాను అందిస్తుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల మధ్య కనెక్టివిటీ ఉండటానికి, అవసరమైనప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి ఈ స్కీమ్ సహాయపడుతుందని’ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.