Moon | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-1 ప్రపంచానికి దిక్సూచిగా మారింది. 15 ఏండ్ల క్రితం ప్రయోగించిన ఈ మిషన్… భూమికి పంపించిన డాటాను వినియోగించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. జాబిల్లిపై నీటి జాడ ఉందని ప్రపంచానికి చెప్పి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-1 తాజాగా మరో అద్భుతం చేసింది. నీటి పుట్టుకకు మూలాన్ని కూడా శాస్త్రవేత్తలకు తెలియజేసింది. చంద్రయాన్-1లోని మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ పంపించిన డాటాను విశ్లేషించిన అమెరికా పరిశోధకులు జాబిల్లిపై నీటి పుట్టుకకు మూలాన్ని కనుగొన్నారు. భూమిపై ఉండే ఎలక్ట్రాన్ల కారణంగా చంద్రుడిపై నీరు ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ హవాయి పరిశోధకులు వెల్లడించారు.
2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 జాబిల్లిపై నీటి జాడలను ప్రపంచానికి తెలియజేసింది. దీంతో సౌర గాలుల్లో ఉండే బలమైన ప్రొటాన్ల కారణంగా జాబిల్లిపై నీరు ఏర్పడి ఉండవచ్చని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ నిరంతరం సాధ్యపడదు. సూర్యుడి సౌర గాలులు ఎల్లప్పుడు చంద్రుడి ఉపరితలాన్ని చేరుకోలేవు. భూమి మాగ్నెటోటైల్ (భూ అయస్కాంత వాతావరణం) గుండా చంద్రుడు పయనిస్తున్నప్పుడు సౌర గాలులు చంద్రుడి ఉపరితలాన్ని తాకలేవు. అందువల్ల ఆ సమయంలో నీరు ఏర్పడదు. భూమి మాగ్నెటోటైల్ వెలుపల చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే సౌర ప్రొటాన్లు ఉపరితలాన్ని చేరుకొని నీరు ఏర్పడేలా చేస్తుంది. చంద్రయాన్-1 నుంచి సేకరించిన డాటాను విశ్లేషించిన పరిశోధకులు.. భూమి మాగ్నెటోటైల్ పరిధిలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా నీరు ఏర్పడుతున్నట్టు గుర్తించారు. జాబిల్లి ఉపరితలంపై ఉండే రాళ్లు, ఖనిజాలను ఈ ఎలక్ట్రాన్లు కరిగించి నీరుగా మారుస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు.