Browsers History | ఈ ఇంటర్నెట్ యుగంలో వెబ్సైట్లు, బ్రౌజర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెబ్ పేజీలు స్పీడ్గా ఓపెన్ కావాలంటే ఒక బ్రౌజర్.. డౌన్లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉండాలంటే మరో బ్రౌజర్… ఇలా నెటిజన్లు రకరకాల బ్రౌజర్లను వాడుతున్నారు. కంప్యూటర్ యూజర్ల అవసరాల కోసం బ్రౌజర్లు కూడా అధునాతన ఫీచర్లు తీసుకొస్తున్నాయి. ఇదంతా ఓకే కానీ.. కంప్యూటర్ కొత్తగా వచ్చిన సమయంలో ఇంటర్నెట్ బ్రౌజింగ్కి ఎలాంటి బ్రౌజర్లు వాడారు? వరల్డ్ వైడ్ వెబ్ ( www ) నుంచి మొదలు పెడితే.. ఇప్పటి గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా వంటి బ్రౌజర్లు ఎలా వచ్చాయి. వంటి బ్రౌజర్ల హిస్టరీ ఒకసారి తెలుసుకుందాం..
మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా ముందుగా www అని టైప్ చేస్తుంటాం. మరి దీన్ని ఎవరు ప్రతిపాదించారో తెలుసా? 1989లో సర్ టిమ్ బెర్నల్స్ – లీ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లో బెర్నర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా.. ఇతరులకు పంపించాలన్నా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని అనుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్ల మధ్య వేగంగా ఇన్ఫర్మేషన్ బదిలీ అయ్యేందుకు ఈ www ను తీసుకొచ్చాడు. వీటితో పాటు html, http, URL వంటి ఇంటర్నెట్ బేసిక్ కాన్సెప్ట్ను ప్రతిపాదించారు. ఇక తొలుత తీసుకొచ్చిన బ్రౌజర్కు నెక్సస్ అని పేరు పెట్టాడు. అయితే దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ నెక్ట్స్ కంపెనీ ఇవ్వడంతో వాళ్ల కంప్యూటర్లలో మాత్రమే డేటా బదిలీ అయ్యేది. దీంతో అన్ని కంప్యూటర్లలో డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఆ బ్రౌజర్లో పలు మార్పులు చేశాడు. దీనికి లైన్ మోడ్ బ్రౌజర్ అని పేరు పెట్టాడు. అయితే ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కనిపించేది.
నెక్సస్ బ్రౌజర్లో కేవలం టెక్ట్స్ మాత్రమే బ్రౌజ్ చేసేందుకు వీలుండేది. అందుకే దీనికి మరింత ఆధునికతను జోడించి 1993లో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లోని నేషనల్ సెంటర్ ఫర్ సూపర్ కంప్యూటర్ అప్లికేషన్ను రూపొందించింది. మొజాయిక్ పేరిట తీసుకొచ్చిన ఈ బ్రౌజర్లో టెక్ట్స్తో పాటు ఫొటోలు, గ్రాఫిక్స్ కనిపించేలా పలు మార్పులు చేశారు. 1997 వరకు ఈ బ్రౌజర్ను ఎక్కువగా ఉపయోగించారు. దీనికంటే ముందు యూనిక్స్ కంప్యూటర్ల కోసం ఎరీనా బ్రౌజర్ అందుబాటులో ఉండేది.
మొజాయిక్ బ్రౌజర్ రూపకల్పనలో భాగమైన మార్క్ ఆండ్రీస్సెన్, ఎరిక్ బినా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి.. నెట్స్కేప్ పేరిట కొత్త బ్రౌజర్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని నెట్స్కేప్ నావిగేటర్గా మార్చారు. 1994లోనే ఐబీఎం కంపెనీ ఐబీఎం వెబ్ ఎక్స్ప్లోరర్, యాపిల్ కంపెనీ మ్యాక్ వెబ్ను ఆవిష్కరించాయి. వాటితో పాటు పలు బ్రౌజర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన నెట్ స్కేప్ బ్రౌజర్ను యూజర్లు విపరీతంగా ఆదరించారు. 1995లో నెట్ స్కేప్ నావిగేటర్ 90 శాతం మార్కెట్ సాధించింది.
చాలా కంపెనీలు బ్రౌజర్లను రూపొందించి సక్సెస్ అవుతుండటంతో.. దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ వైపు అడుగులేసింది. 1995లో విడుదల చేసిన విండోస్ 95 ఓఎస్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 1.0 బ్రౌజర్ను ఉచితంగా కంప్యూటర్ యూజర్లకు అందించింది. చాలామంది విండోస్ ఓఎస్నే వినియోగించడంతో.. వారంతా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే వాడటం మొదలుపెట్టారు. అదికాకుండా అందరూ తమ బ్రౌజర్నే వినియోగించాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్బిల్ట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ను ఇచ్చింది. అలాగే వేరే బ్రౌజర్ను ఇన్స్టాల్ చేసుకునే వీలులేకుండా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా ప్రభుత్వం మైక్రోసాఫ్ట్పై కేసు కూడా నమోదు చేసింది. 2001లో ఈ కేసు పరిష్కారమైంది. అయినా చాలాకాలం పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే నంబర్వన్గా నిలిచింది. 2002లో 95 శాతం యూజర్లు ఐఈనే వాడినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రాకతో నెట్స్కేప్కు ఆదరణ తగ్గిపోయింది. దీంతో దివాలా తీసే పరిస్థితులకు చేరిన నెట్స్కేప్ను ఏవోఎల్ సంస్థ 1998లో కొనుగోలు చేసింది. ఆ తర్వాత మొజిల్లా ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. కొన్ని నెలలకు నెట్స్కేప్ బ్రౌజర్లో ఉన్న లైసెన్స్ విధానాన్ని రద్దు చేసింది. అందరూ ఈ బ్రౌజర్ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. బ్రౌజర్ సోర్స్కోడ్ను బహిర్గతపరుస్తూ.. కొత్త బ్రౌజర్ను తీసుకొచ్చింది. 2004లో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బ్రౌజర్ 2011లో 28 శాతం మార్కెట్ షేర్ను సంపాదించుకుంది. 2003 యాపిల్ కంపెనీ సఫారీ బ్రౌజర్ను ప్రారంభించింది. అయితే ఇది కేవలం యాపిల్ డివైజ్ల్లో మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎక్కువగా పాపులర్ అవ్వలేదు.
కేవలం సెర్చింజన్లా ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన గూగుల్.. తక్కువ సమయంలోనే విశేష ఆదరణ పొందింది. యాహూ, ఏఓఎల్ వంటి సెర్చింజన్లతో పోలిస్తే గూగుల్లో సెర్చింగ్ సులువుగా ఉండటంతో నెటిజన్లు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో నెటిజన్లకు మరింత దగ్గర కావాలన్న ఉద్దేశంతో మొజిల్లా కంపెనీలో పనిచేసే పలువురు ఉద్యోగులను తమ సంస్థలో నియమించుకుని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను అభివృద్ధి చేసింది. 2008లో గూగుల్ క్రోమ్ 1.0 ను తీసుకొచ్చింది. మొదట్లో క్రోమ్ వాడేందుకు చాలామంది నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపలేదు. కేవలం ఒక శాతం యూజర్లు మాత్రమే ఉండేవాళ్లు. కానీ 2020 అక్టోబర్లో విడుదలైన ఓ డేటా ప్రకారం.. 64 శాతం మంది యూజర్లతో క్రోమ్ నంబర్ వన్గా ఉంది. ఆ తర్వాత సఫారీ 19 శాతంతో రెండో స్థానంలో ఉంది. మొజిల్లా, గూగుల్ క్రోమ్ రాకతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెనుకబడింది. దీంతో 2015లో ఐఈ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ను తీసుకొచ్చింది.
ప్రస్తుతం గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్తో పాటు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా, సఫారీ, పేల్మూన్, సీ మంకీ, వివాల్డీ వంటి అనేక బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
Whatsapp : వాట్సప్ తరుచూ లాగ్ ఔట్ అయిపోతోందా? దానికి కారణం ఇదే
యూట్యూబ్ ట్యాక్స్.. అసలేంటిది? ఇండియన్స్పై ప్రభావం ఎంత?