కరాచీ: పాకిస్థాన్లో వారం క్రితం క్వెట్టా సిటీలో ఓ ప్రయాణికుల రైలుపై కారు బాంబుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ఆ దేశ భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. బలోచిస్తాన్ ప్రావిన్సులోని వివిధ జిల్లాల్లో సెక్యూర్టీ దళాలు నిర్వహించిన ఆపరేషన్లో సుమారు 17 మంది అనుమానిత ఉగ్రవాదులు(Suspected Terrorists) హతం అయ్యారు. మే 24వ తేదీన క్వెట్టా సమీపంలో ఓ షటిల్ రైల్పై ఆత్మాహుతి దాడి జరిగిన ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. కారు బాంబుతో రైలుపై అటాక్ చేశారు.
పాకిస్థాన్ మిలిటరీకి చెందిన ఇంటెలిజెన్స్ శాఖ బలోచిస్తాన్లో ఆపరేషన్ చేపట్టింది. ఐఎస్పీఆర్ ప్రకారం 17 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాద రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు. మస్తుంగ్, నౌషికి, జెహ్రీ, కుజ్దార్, కెచ్ ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.ఫిత్నా అల్ హిందుస్తాన్ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ వెల్లడించింది. ఉగ్ర స్థావరం నుంచి ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్ధాలు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.