5G Network | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భారతదేశం కేవలం 200 రోజుల్లోనే 600 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ సేవలు అందించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిందని కేంద్ర సహాయ మంత్రులు దేవుసిన్హా చౌహాన్, ఏ నారాయణస్వామి పేర్కొన్నారు. జీ20 ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్’ (డీఈడబ్ల్యూజీ) రెండో సమావేశం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా, సమ్మిళిత సంక్షేమం, సమ్మిళిత వృద్ధి స్ఫూర్తితో భారత ప్రభుత్వం ప్రజావిధానాలు అమలు చేస్తున్నదని చెప్పారు.
200 రోజుల్లోనే 600 జిల్లాలను 5జీ నెట్వర్క్తో కవర్ చేశామని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విస్తరణల్లో ఒకటని స్పష్టంచేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరతో, ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్తో, తకువ వ్యవధిలో స్వదేశీ 4జీ, 5జీ టెక్నాలజీలను అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్టు చెప్పారు. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా మొత్తం మూడు సదస్సులు నిర్వహించారు. హైస్పీడ్ మొబైల్ బ్రాడ్ బ్యాండ్, దాని ప్రభావాలు, డిజిటల్ ఇన్క్లూజన్-కనెక్టింగ్ ది అన్ కనెక్ట్, సస్టెయినబుల్ గ్రీన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- చాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ పేరుతో జరిగిన ఈ సదస్సుల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జీ20 ప్రతినిధి బృందాల సభ్యులు హైదరాబాద్ ఐఐటీని సందర్శించారు. 5జీ, 5జీఐ, 6జీ సిస్టమ్ ప్రొటోటైప్, అటానమస్ నావిగేషన్, కృత్రిమ మేధ ఆధారిత ఆర్ఎన్ఏ- ఎలక్ట్రానిక్ టెస్ట్ కిట్ వంటి కీలక ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు.