సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 27 : సమాజంలో మంచి కన్నా చెడుకు తొందరగా అలవాటు పడుతారనే విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ జీవితంపై ఇంకా అవగాహన రాని విద్యార్థులైతే మరింత సందిగ్ధంలో ఉంటారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు సమాజంపై విరుచుకుపడుతున్నారు. విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడేలా చేసి వారి జీవితాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పక్కా రాష్ర్టాల నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చి సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో గోప్యంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఎండు గంజాయిని 10 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అక్రమార్కుల తీరు మారడం లేదు. జహీరాబాద్, సదాశివపేట ప్రాం తాల్లో పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. వారు అనుకున్నట్టుగానే వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం అక్రమార్కుల వలలో చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలని ఎక్సైజ్ అధికారులు సూచిస్తున్నారు.
సదాశివపేటలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు
సదాశివపేటలోని ఊబ చెరువు (మినీ ట్యాంక్ బాండ్)ను అక్రమార్కులు వేదిక చేసుకున్నారు. ద్విచక్ర వాహనంలో ఒక్కో ప్యాకెట్లో సుమారు 10 గ్రాముల ఎండు గంజాయిని విద్యార్థులు, యువతకు అమ్ముతున్నారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు చేరడంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని వల పన్ని పట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఊబ చెరువు దగ్గర తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హోండా యాక్టీవ నెంబర్ టీఎస్ 07 ఎఫ్జీ 3544లో అక్రమంగా గం జాయిని అమ్ముతున్నట్లు తేల్చారు. 18 ఎండు గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. గంజాయి అమ్ముతున్న నిందితుడు సదాశివపేటకు చెందిన ఎండీ శారొద్దీన్గా గుర్తించారు. 180 గ్రాముల ఎండు గంజాయితో పాటు రూ.5 వేలు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు శారొద్దీన్పై కేసు నమోదు చేసి విచారణ కోసం సంగారెడ్డికి తరలించారు. విచారణలో భాగంగా నిందితుడు కర్ణాటకలోని బీదర్ నుంచి అక్రమంగా ఎండు గంజాయిని తెచ్చి సదాశివపేట, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు అమ్ముతున్నట్టు అంగీకరించాడు. తనిఖీలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పాల్గొన్నారు.
విద్యార్థులనే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు
జిల్లాలోని విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకొని గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లా పక్కా రాష్ర్టాల సరిహద్దులో ఉన్నందున అక్రమార్కులు ఏదో ఒక మార్గం ద్వారా మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎండు గంజాయిని చిన్న ప్యాకెట్ల రూ పంలో తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారు. జిల్లాలో ఎవరు మత్తు పదార్థాలను అమ్మినా, కొన్నా చట్ట పరంగా చర్యలు తప్పవు. సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మత్తుపదార్థాలు అమ్మితే వెంటనే సమాచారం అందించాలి.