తెలుగు ఇండస్ట్రీలో కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి కూడా ఉంటుంది. దాదాపు 18 ఏళ్ల కింద కలర్స్ అనే ప్రోగ్రాంతో ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్ల పాటు బుల్లితెరను ఏలేసింది. ఆ తర్వాత సినిమాల్లో ఇప్పుడు వచ్చి రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో పని చేసింది. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి విజయాలు అందుకుంది. అలాగే తమిళంలో కూడా స్వాతికి మంచి క్రేజ్ వచ్చింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి. కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ హీరో అడవి శేష్ విడుదల చేశాడు. సీనియర్ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, సముద్రకని లాంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కూతురు, దొరసాని ఫేమ్ శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద తదితరులు పంచతంత్రం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పోస్టర్ లోనే కొత్తదనం కనిపిస్తుంది. ప్రతి జీవికి అవసరమైన రంగు రుచి వాసన స్పర్శ వినికిడి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇది. అన్ని ఎమోషన్స్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ హర్ష ఈ కథను సిద్ధం చేశాడు. తన రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ స్టోరీ అంటుంది స్వాతి రెడ్డి. దాదాపు ఆరేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా ఇది. కలర్ ఫోటో సినిమాని తెరకెక్కించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు మాటలు రాస్తుండటం విశేషం. మరి పంచతంత్రం సినిమా స్వాతి రెడ్డి అంచనాలు ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.