రంగారెడ్డి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) నుంచి (భారత్ రాష్ట్ర సమితి) బీఆర్ఎస్గా ఆవిర్భావం దేశంలో ఒక మహోజ్జల ఘట్టం. గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు జనం గొంతుకలో నానుతున్న పదం ‘బీఆర్ఎస్’. ప్రధానంగా యువత, ప్రజల నాల్కలపై నాట్యం చేస్తున్నది. రెండు దశాబ్దాల తెలంగాణ పార్టీ ఎన్నో విజయాలను అందుకుని ఒక దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో రాష్ర్టాన్ని తీర్చిదిద్దడం, పొరుగు రాష్ర్టాలు జీర్ణించుకోలేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోవడం లాంటివి తెలంగాణ రాష్ట్రం వైపు దేశం యావత్తు చూసేలా చేసుకున్నం. అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటి వరకు దేశమంతా రాష్ట్ర పురోగతిపై చర్చోపచర్చలు చేసుకున్నది. ఇదంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, శ్రమ, పట్టుదల, సాధన వెరసి జాతి దేశంలో తెలంగాణ ఒక చర్చనీయాంశం అయ్యింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టిని జాతీయ రాజకీయాల వైపు మరల్చుతూ, విజయ దశమిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ (బీఆర్ఎస్) పార్టీగా ఆవిష్కరించడం, దీనిపై జిల్లాలో యువత గొంతుల్లో చర్చ పెద్ద ఎత్తున సాగుతున్నది. గ్రామాల్లోని గల్లీలు, బస్తీలు, వీధులు, ప్రధాన కూడళ్లు, పట్టణాలు, నగరాల వరకు ఇదొక ప్రత్యేక అంశంగా సంతరించుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిష్కరించబడటం, దేశంలోని ప్రధాన పార్టీలను సవాలు చేస్తూ వాటికి దీటుగా నిలబడటం ప్రధాన అంశంగా మారింది. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీ, రాష్ర్టాన్ని సాధించుకొని, దేశం నివ్వెర పోయాలా వృద్ధి పథంలో సాగడం, పార్టీ అధినేత ఒక వ్యూహం ప్రకారం అడుగులు కదుపుతూ జాతీయ రాజకీయాల్లోకి ముందడుగు వేసిన తరుణంలో కేసీఆర్ ‘దేశ్ కీ నేత’గా రాణించగలుగుతాడా? అని యువత చర్చలు చేస్తున్నది. ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్న పార్టీ.. దేశ రాజకీయాల్లోనూ రాణించగలదని, జాతీయ రాజకీయాలను కేసీఆర్ తన చతురతతో శాసించగలడని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని రంగాలపై అపార అనుభవం ఉన్న కేసీఆర్ తరహా వ్యక్తులు మనకు దొరకడం చాలా అరుదు అని యువతరం పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ‘దేశ్ కీ నేత’గా కేసీఆర్ను పలువురు యువకులు అభివర్ణించారు. దేశం యావత్తు అభివృద్ధి పథంలో పయనించి, దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు. నిరంకుశ పాలనతో కొనసాగుతున్న కేంద్రానికి సరైన బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. జాతీయ పార్టీ ఆవిష్కరణపై ఇంకా యువత ఏమంటున్నదో వారి మాటల్లోనే చూద్దాం..
బంగారు తెలంగాణ దిశగా పరుగులు
ఎనిమిదేండ్ల వ్యవధిలోనే తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ది. ఇదే సమయంలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదు. ఒక్క అదానీ.. అంబానికి తప్ప! కేసీఆర్ యువతరంపై దృష్టి సారించి ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన్రు. ప్రస్తుతం దేశాన్ని తాకట్టు పేట్టే దిశగా మోదీ అడుగులు వేస్తున్నరు. ఈ తరుణంలో జాతికి కేసీఆర్ నాయకత్వం అవసరం. దేశ ప్రజలు అవకాశం ఇచ్చి, కేసీఆర్ వెన్నంటి ఉంటే.. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని తీర్చిదిద్ది ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్పుతారు. ఆ నమ్మకం మాకుంది.
– వడ్డెమోని శివకుమార్, గ్రాడ్యుయేట్, ఆమనగల్లు, కల్వకుర్తి
యావత్ భారతం బాగుపడుతుంది..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ ప్రస్తుతం సముచితం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ఖాయం. 14ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్ల కాలంలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తెలంగాణను దేశంలోనే నెంబర్వన్గా నిలిపిన ఘనత కేసీఆర్ది. బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో పురోగతి సాధించడం తథ్యం. ఉద్యమ నేత అయిన కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో తిరుగు ఉండదు. అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో అరుదు.
– దినేశ్ యాదవ్, షాబాద్
బీఆర్ఎస్తో దేశ ప్రజలకు ప్రయోజనం..
బీఆర్ఎస్ పార్టీని స్థాపించడంతో దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలకు చేసింది ఏమిలేదు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసిన్రు. అది అలా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికే బీఆర్ఎస్ సరైన సమయంలో పుట్టింది. దేశ ప్రజలకు మేలు జరగాలంటే కొత్త జాతీయ పార్టీ దేశంలో చాలా అవసరం. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలోని వివిధ రాష్ర్టా ప్రజల నుంచి స్పందన వస్తుంది. అన్ని రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణను చూరగొని అతి పెద్ద పార్టీగా విస్తరిస్తున్నదని ప్రజలు విశ్వసిస్తున్నారు.
– గడ్డం అంజిరెడ్డి, సురంగల్, మొయినాబాద్
అన్ని రాష్ర్టాల నుంచి స్పందన..
బీఆర్ఎస్ పార్టీతో దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వడంతో దేశ సంపదను కొల్లగొట్టారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన పలు పార్టీల తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన జాతీయ పార్టీపై ప్రజలకు సదాభిప్రాయం ఉంది. దేశంలో అన్ని రాష్ర్టాల నుంచి మంచి స్పందన ఉంది. దేశ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ పార్టీల్లో అతి పెద్ద పార్టీగా విస్తరించనున్నది. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం. ప్రజల భావన కూడా అదే.. దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా కూడా అమలు అవుతాయి. కేసీఆర్ వ్యూహరచన దేశానికి పురోభివృద్ధి. – గునుగుర్తి జయవంత్,
చిలుకూరు, మొయినాబాద్