యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో సరస్వతీదేవి పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకుని జ్ఞానసరస్వతీ మందిరంలో ఆదివారం వసంతపంచమి కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. జ్ఞాన సరస్వతీ సేవాసమితి వ్యవస్థాపకులు సదా వెంకట్రెడ్డి, పురోహితులు రాఘవేంద్రశర్మ, సమక్షంలో వసంత పంచమి కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల ప్రజలే కాకుండా చుట్టు పక్కల మండలాల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో జ్ఞాన సరస్వతీ మందిరాన్ని సందర్శించి, సరస్వతీదేవిని దర్శించుకున్నారు.
ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, గణపతిపూజ, పుణ్యాహావాచనం, పంచగవ్యప్రాశనం, సరస్వతీ హోమం, అఖండదీపారాదన, కుంకుమార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. విద్యార్థులతో 108 కలశాలతో అమ్మవారికి అభిశేకం, చిన్నారులకు ఉచితంగా పెన్నులు, పలుకలు, నోటుపుస్తకాలు అందజేశారు. ఆలయంలో విద్యార్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ నమస్తుభ్యం అనే నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. జగద్గురులు హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ ఆలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు, సరస్వతీ హోమం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేయించి, విద్యార్థులకు తన అమూల్యమైన సందేశాన్ని అందించారు.
విద్యార్థులకు, చిన్నారులకు తమ ఆశీస్సులను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఆలయంలో సరస్వతీ హోమం నిర్వహించటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకోవటంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. మొత్తంగా ఆలయ ప్రాంగణమంతా సరస్వతీ నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో, ప్రజాప్రతినిధులు, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు.