రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని విలీన మున్సిపాలిటీల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. శివారులోని మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత అధికారులు పాలనపై దృష్టి సారించడం లేదు. దీనికి తోడు టౌన్ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ..అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ తదితర మున్సిపాలిటీలు, అలాగే, మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీ విలీనం చేసింది. విలీనం అక్కడ పాలన అస్తవ్యస్తంగా మారింది.
జీప్లస్ -2 పేరుతో బహుళ అంతస్తులు..
జిల్లాలోని విలీన మున్సిపాలిటీల్లో కొందరు జీప్లస్-2 భవనాలకు అనుమతులు తీసుకుని.. పెద్ద ఎత్తున బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. హెచ్ఎండీఏ నుంచి జీప్లస్-2 భవనాలకు పర్మిషన్ తీసుకుని టౌన్ప్లానింగ్ అధికారులకు లంచాలు ముట్టచెప్పి ఐదారు అంతస్తులను నిర్మిస్తున్నారు. మరోవైపు రెసిడెన్షియల్ భవనాల పేరుతో కమర్షియల్ భవనాలు విరివిగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీల్లో రిసార్టులు, పలు ఫంక్షన్హాళ్లు, కమర్షియల్ భవనాలనూ యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ ల్లో అక్రమ నిర్మాణాలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి వాటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
గురురాఘవేంద్ర కాలనీలో అడ్డూ అదుపు లేకుండా..
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల ముందు ఉన్న గురురాఘవేంద్రకాలనీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కాలనీలో సుమారు యాభైకి పైగా రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ కాలనీలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని బహుళ అంతస్తులను నిర్మించి కమర్షియల్కు వినియోగిస్తున్నవి 50కి పైగా ఉన్నట్లు సమాచారం. కేవలం అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి. టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులిచ్చే మామూళ్లకు అలవాటు పడి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. రాత్రికి రాత్రే అంతస్తులపై అంతస్తులను నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా వారు పట్టించుకోవడంలేదన్నారు.