తాండూరురూరల్, జూలై 5 : భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తి కావడంతో నీటితో కళకళలాడుతున్నాయి. తాండూరు నియోజకర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు 7 చెక్ డ్యాంల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ చెక్ డ్యాంలను కాగ్నా వాగులో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే 6 నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది. తాండూరు మండలంలోని ఎల్మకన్నె, చిట్టిఘనాపూర్, బషీరాబాద్ మండలంలోని జీవన్గీ, క్యాద్గిరా, యాలాల మండలంలోని గోవింద్రావుపేట, కోకట్, పెద్దేముల్ మండలంలోని మంచన్పల్లి గ్రామాలకు చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. యాలాల మండలంలోని కోకట్ పరిధిలోని చెక్ డ్యాం పనులు కావాల్సి ఉంది. ఎల్మకన్నె చెక్డ్యాం నిర్మాణం కోసం రూ.5.66 కోట్లు మంజూరయ్యాయి.
అదేవిధంగా ఎల్మకన్నె చెక్డ్యాం కోసం రూ.7.02 కోట్లు, జీవన్గీ చెక్డ్యాం కోసం రూ.7.20కోట్లు, క్యాద్గిరాకు రూ.4.75కోట్లు, మంచన్పల్లికి రూ.3కోట్లు, గోవింద్రావుపేట చెక్డ్యాంకు రూ.4.50కోట్లు, కోకట్ చెక్డ్యాం నిర్మాణం కోసం రూ.9.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ చెక్ డ్యాంలు పూర్తి కావడంతో బ్యాక్ వాటర్తో నిండిపోయాయి. కాగ్నావాగు చుట్టూ భూములున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు, బోర్లలో కూడా నీటి మట్టం పెరిగింది. రైతులకు సంవత్సరానికి మూడు పంటలు సాగు చేసుకునే అవకాశం దక్కింది.
1500 మంది రైతులకు మేలు
కాగ్నా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంల కారణంగా తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని 1500 మంది రైతులకు మేలు జరిగింది. కాగ్నా చుట్టూ పంటలు సాగు చేసుకునే రైతుల బోర్లలో నీటి మట్టం అమాంతంగా పెరిగిపోయాయి. చెక్డ్యాంల నిర్మాణాలు కాకముందు కాగ్నా వాగులో పారే నీరు కర్ణాటక రాష్ర్టానికి వెళ్లేవి. తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయడం వల్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
6 చెక్ డ్యాంలు పూర్తి
కాగ్నా వాగుపై 7 చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టాం. అందులో 6 చెక్ డ్యాంలు పూర్తి అయ్యాయి. కోకట్ లోని చెక్ డ్యాం పనులు పెండింగ్లో ఉన్నాయి. దాని పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– సాయి, ఏఈ