కొత్తూరు, జనవరి 18 : అత్యంత ప్రఖ్యాతి చెందిన జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజులపాటు జరుగనున్నాయి. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన దర్గాల్లో జేపీ దర్గా ఒకటి. హైదరాబాద్కు కేవలం 45 కి.మీ దూరంలో ఉండే ఈ దర్గాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ తలనీలాలు సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉర్సుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున పాల్గొంటారు. కేవలం ముస్లింలే కాకుండా అన్ని కులాల వారు ఈ దర్గాను దర్శించుకుంటారు. ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే ఈ దర్గాను దర్శించుకోవడం చూస్తే భక్తులకు ఈ దర్గాపై ఉన్న నమ్మకం ఎలాంటిదో చెప్పవచ్చు. సీఎం కేసీఆర్కు కూడా దర్గాకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారు. త్వరలో దర్గా మాస్టర్ ప్లాన్ మొదలు కానుంది.
ఉర్సు ఏర్పాట్లకు రూ.7.5 లక్షలు కేటాయింపు
నేటి నుంచి జరుగనున్న ఉర్సు ఏర్పాట్ల కోసం వక్ఫ్ బోర్డు రూ.7.5 లక్షలు కేటాయించింది. దీంతో ఉర్సు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దర్గాకు రంగులు వేయడం, లైటింగ్, వేలాదిగా వచ్చే వాహనాల కోసం పార్కింగ్, కొత్తగా మూత్రశాలలు, వీఐపీల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 18 ఎకరాల స్థలంలో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్గాను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. 19న గంధోత్సవం, 20న దీపారాధన, 21న ఖత్మేఖురాన్తో ఉర్సు ముగియనుంది.
పటిష్ట బందోబస్తు
రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు రానుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అందుకోసం షాద్నగర్ ఏపీపీ కుషాల్కర్ దర్గాను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు అధికారులకు తగు సూచనలు చేశారు. పోలీసులతో ఏసీపీ బుధవారం దర్గాలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీపీతో సహా, ఏడుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 88 మంది కానిస్టేబుల్స్, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, వారితోపాటు ప్రత్యేక క్రైం టీం కూడా ఉంటుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు
దర్గాకు రావడానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందుకోసం ప్రతి అరగంటకు ఒకటి చొప్పున మూడు రోజులపాటు అఫ్జల్గంజ్, చార్మినార్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.