కులకచర్ల, డిసెంబర్ 12 : ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలు అందిస్తుండంటంతో ప్రజలకు బ్యాంకుల ద్వారా చాలా వరకు ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన పల్లె సమగ్ర సేవా కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు బ్యాంకులకు వెళ్లే పాట్లు తప్పుతున్నాయి. తమ అవసరాల కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తీరుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 60 రకాల సేవలు అందేలా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, బ్యాంకింగ్, ఫైనాన్స్తో పాటు మీ సేవ కేంద్రాల్లో లభించే 60 రకాల సేవలను ఈ కేంద్రాల ద్వారా పొందవచ్చు. దీంతో దూర భారంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం ప్రజలకు తప్పుతుంది. ఏ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లేవారు. కాని నేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల వల్ల డబ్బుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లవలసిన ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. కేంద్రాల నిర్వాహకులు డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకువచ్చి వినియోగదారుల ఇబ్బందులు తీరుస్తున్నారు. మండలంలో కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తున్న తీరును చూసి అంతారం గ్రామానికి చెందిన పల్లె సమగ్ర సేవా కేంద్రానికి కలెక్టర్ గతంలో అవార్డును కూడా ప్రదానం చేశారు.
విజయవంతంగా కొనసాగుతున్న కేంద్రాలు
ఉమ్మడి కులకచర్ల మండలంలో 44 గ్రామపంచాయతీలున్నాయి. అంతారం, బండవెల్కిచర్ల, కుస్మసముద్రం, ఇప్పాయిపల్లి, తిర్మలాపూర్, ముజాహిద్పూర్, లింగంపల్లి, కులకచర్ల, సాల్వీడ్ గ్రామాల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాలు సక్రమంగా నడిస్తే ఇతర గ్రామాల్లోనూ నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నెలకొల్పిన పల్లె సమగ్ర సేవా కేంద్రాలను విజయవంతంగా సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నారు. దీంతో తమ గ్రామాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బ్యాంకు సేవలు సద్వినియోగం
పల్లె సమగ్ర సేవా కేంద్రాలను నిర్వహించే గ్రామాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో బ్యాంకుల సంబంధించిన లావాదేవీలు ఆయా గ్రామాల్లోనే సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో రద్దీగా ఉండే బ్యాంకులు పల్లెల్లో ఏర్పాటు చేసిన ఈ సేవల కారణంగా రద్దీ తక్కువై బ్యాంకర్లకు శ్రమ తగ్గింది.
మహిళా సంఘాల సభ్యులకు తగ్గిన శ్రమ
గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల పొదుపు డబ్బులను తమ ఖాతాల్లో జమచేయడం, ఆ డబ్బులను సభ్యులకు అప్పుగా ఇచ్చేందుకు కులకచర్లలో ఉన్న బ్యాంకుకు వచ్చేవారు. కాని నేడు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్లి తమ పొదుపు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయడంతో పాటు డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు అనువుగా ఉందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఒక్కొక్క గ్రామంలో మహిళా సంఘాలు పదుల సంఖ్యలో ఉండటం వలన వారు ప్రతిసారి మండల కేంద్రానికి వెళ్లకుండా ఉండేందుకు పల్లె సమగ్ర సేవా కేంద్రాలు దోహదం చేస్తున్నాయని మహిళలు పేర్కొంటున్నారు.
పల్లె సమగ్ర సేవా కేంద్రాల పనితీరు ఇలా..
గ్రామంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పింఛన్లను గ్రామంలోనే అందించడం, ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడం, స్వయం సహాయక సంఘాల నుంచి పొదుపు నగదు, రుణాలను స్వీకరించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడం, గ్రామస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లాంటి పనులు చేస్తారు. గ్రామంలో ఉండే ప్రజలు ప్రభుత్వ సేవల కోసం మండలస్థాయి వరకు వెళ్లకుండా మీ సేవా కేంద్రాల్లో లభించే 60 రకాల సేవలను గ్రామ స్థాయిలోనే అందిస్తారు. జనన, మరణ, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూమికి సంబంధించిన పహాణి నకలు జారీ లాంటివి పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలోనే పొందవచ్చు. కాని ప్రస్తుతం ఆ పనులను ఇంకా అప్పగించలేదు.
ఉపాధి హామీ కూలీలకు..
ఉపాధి హామీ కూలీలు తాము చేసిన కూలీ డబ్బులు బ్యాంకుల దగ్గరకు వెళ్లకుండా పల్లె సమగ్ర సేవా కేంద్రాలున్న గ్రామాల్లోనే తీసుకుంటున్నారు. దీంతో వారికి ప్రయాణ చార్జీలతో పాటు, సమయం కూడా ఆదా అవుతున్నది. ఈ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి
ఇప్పటికే పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి బ్యాంకుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడకుండా చేస్తున్నారు. ఈ కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీంతో డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుంది. సంబంధిత అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– శంకర్, ఇప్పాయిపల్లి
సద్వినియోగం చేసుకోవాలి
సమగ్ర సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రంలోనే అన్ని రకాల సేవలు అందించడంతోపాటు ఉపాధి హామీ కూలీల డబ్బులు కూడా చెల్లిస్తున్నాం. మహిళా సంఘాలకు నగదును బ్యాంకులో జమ చేస్తున్నాం. బ్యాంకు ఖాతాలను కూడా ఇక్కడే ఇస్తున్నాం.
– ఈట భారతమ్మ, వీఎల్ఈ, అంతారం
బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్నారు
ప్రభుత్వ సేవలన్నీ ఒక చోట అందించడం పల్లె సమగ్ర సేవా కేంద్రాల ముఖ్య ఉద్దేశం. మీ సేవ, ఈ సేవా కేంద్రాల్లో అందిస్తున్న 60 రకాల సేవలను ఇక్కడే అందించే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్నారు. ఇతర గ్రామాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– శోభ, ఏపీఎం, కులకచర్ల