వికారాబాద్ : ప్రైవేటు దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించాలని పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా దవాఖానలోని ఆపరేషన్ గది, రక్తనిధి కేంద్రాన్ని, ఓపీ గది, మెడిసెన్లతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఆర్సీ జాయింట్ డైరెక్టర్ శ్రీప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రం నుంచి వచ్చే ఎన్హెచ్ఎం నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. దవాఖానకు వచ్చే రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అదే విధంగా భారతదేశంలో 767 దవాఖానలను పరిశీలించగా అందులో తాండూరు జిల్లా దవాఖానలో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్ సేవలందించడంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
ఏ దవాఖాన లో ఎలాంటి అవసరాలు సమకూర్చాలి ? ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో వాటిపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. వీటన్నింటి నివేదికలు తయారు చేసి డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమావేశంలో కమిషనర్కు నివేదిస్తామని తెలిపారు. వికారాబాద్ దవాఖానలో సేవలు బాగున్నాయని వివరించారు. అనంతరం డీఎంహెచ్వోను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎన్ఎహెచ్ఎం నుంచి రూ. 27లక్షలు రాగా రూ. 17లక్షలు ఖర్చు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదయ్య తెలిపారు. మిగిలిన నిధులను దవాఖాన అభివృద్ధి, అవసరాలకు ఖర్చు చేయడం జరుగుతుందని వివరించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని కేంద్ర బృందానికి వివరించారు. వీరితో పాటు డీఎంహెచ్వో తుకారాం, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ జగన్నాథ్రెడ్డి, డాక్టర్లు లలిత, సాయిబాబ, రవీందర్యాదవ్, జీవరాజ్, శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.