బొంరాస్పేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం గురువారం సందర్శించింది. ఈ బృందానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) పరిశీలకుడు డాక్టర్ శ్రీకాంత్ నేతృత్వం వహించారు. ఎన్ఆర్హెచ్ఎం ద్వారా పీహెచ్సికి మంజూరైన నిధులు నిబంధనల ప్రకారం వినియోగిస్తున్నారా లేదా, దవాఖానలో రోగులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి అనే కోణంలో శ్రీకాంత్ బృందం నిశితంగా పరిశీలించింది. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, క్షయ, కుష్టు వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి మండల వైద్యాధికారి రవీంద్రయాదవ్ను అడిగి తెలుసుకున్నారు.
టీబీ, క్షయవ్యాధిపై గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ వివరించారు. దవాఖానలోని పలు రికార్డులను, పరిసరాలు, పచ్చదనాన్ని అధికారులు పరిశీలించి బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బురాన్పూర్లోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూడా సందర్శించి క్షేత్రస్థాయిలో వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందిండానికి పీహెచ్సీకి అదనంగా ఒక డాక్టర్ను, ప్రతి ఏఎన్ఎంకు అదనంగా మరో ఏఎన్ఎంను నియమించాలని వీరితో పాటు పీహెచ్సీకి వాహనాన్ని ఇవ్వాలని మండల వైద్యాధికారి రవీంద్రయాదవ్ కేంద్ర బృందాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా, డీఎస్వో డాక్టర్ అరవింద్, దౌల్తాబాద్ మండల వైద్యాధికారి రతన్లాల్, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.