యాచారం, జనవరి 24 : గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాలో మంగళవారం ప్రగతి నివేదన పాదయాత్ర మూడవ రోజు విజయవంతంగా కొనసాగింది. సర్పంచ్ రమావత్ జగదీశ్తో కలిసి ప్రశాంత్కుమార్రెడ్డి తండాలో ఇంటింటికీ తిరిగి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను అయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. గతంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడే తండాలు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరందించడంతో వంద శాతం ఫ్లోరైడ్ సమస్య తీరిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, తండాల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు.
తక్కళ్లపల్లితండాలో రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను చేయించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రగోలతండా వద్ద ఆర్టీసీ బస్సులు ఆపేలా డీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం తక్కళ్లపల్లి గ్రామంలో పాదయాత్రను కొనసాగించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని, పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, సర్పంచ్ సంతోష, ఎంపీటీసీ సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేశ్, బీఆర్ఎస్ నాయకులు లోహిత్రెడ్డి, రమేశ్, గోవర్ధన్నాయక్, సంపత్, కల్లూరి కల్లూరి శివ తదితరులు పాల్గొన్నారు.