బడంగ్పేట, మహేశ్వరం : ప్రధాని మోదీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వల్ల తెలంగాణకు మేలు జరుగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita reddy) పేర్కొన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని రావిర్యాల, మోహబత్ నగర్, తుమ్మలూరు, ఎన్డీ తండా, కేసీ తండా, మహేశ్వరం టౌన్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్(CM KCR) వల్లనే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు (Power) ఉండదని, బీజేపీ వస్తే మతం, కులం అంటు అంతరాలు పెంచి ప్రజల మధ్య చిచ్చు పెడుతారని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఏ రాష్ట్రంలో లేదన్నారు. కరోనా, వరద సమయంలో ప్రజలు కష్టాలతో అల్లాడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీలను బంజారహిల్స్కు దీటుగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మహేశ్వరం సరిహద్దులు తెలియవని అలాంటి వ్యక్తి ఓటేస్తే ఓటు విలువ పడిపోతుందని అన్నారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే గ్యాస్ రూ.400కే ఇస్తుందని, రెండు వేల ఫించన్ను ఐదు వేలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీపీ సునితా అంద్యానాయక్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తుక్కుగూడ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, బీఆర్ఎస్ మహేశ్వరం అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు ఉన్నారు.