కోట్పల్లి, ఏప్రిల్ 06 : గ్రామంలో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు గ్రామ గ్రామాన మీతో నేను కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని జిన్నారం గ్రామంలో మీతోనేను కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం 7గంటలకు జిన్నారం గ్రామానికి చేరుకుని గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామ పంచాయతీ భవనం వద్ద గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో ముచ్చటిస్తూ… సమస్యలను అడిగి తెలుసుకుని, ఒక్కో సమస్యను అడుగుతూ.. సంబంధిత అధికారులతో అట్టి సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపించారు. మీతో నేను కార్యక్రమాన్ని గ్రామంలొ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకున్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షుడు అనిల్కుమార్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేశం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, ఎంపీటీసీ బందెయ్య పాల్గొన్నారు.