బంట్వారం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ. 2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘రైతుబంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలానికి చేరుకున్న మంత్రికి స్థానిక రైతులు, నాయకులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో తోరణాలు కట్టుకొని ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు ఆరు వేల కోట్ల నిధులను జమ చేశామన్నారు. రైతుల అకౌంట్లలో నేరుగా వ్యవసాయ పెట్టుబడులను జమ చేస్తున్న మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ యొక్క సంకల్పం రైతుల పట్ల ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చన్నారు.
రైతును రాజు చేయడం అంటే కిరీటం పెట్టడం కాదని, రైతును ఆత్మగౌరంతో బ్రతకడమేనన్నారు. నేడు రైతు బందుతో రైతన్నలు ఎంతో ఆత్మగౌరవంగా బ్రతుకున్నారనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రోజు రైతులు చేస్తున్న సంబురాలను చూస్తే ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్లుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రైతుల గురించి, వ్యవసాయం తెలియని వారు నేడు అవాకులు, చేవాకులు మాట్లాడడం చూస్తే విడ్డురంగా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రైతుల నుంచి తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను విడదీయలేరని చెప్పారు.
రైతుల ఆశీర్వాదాలే ముఖ్యమంత్రికి శ్రీరామ రక్షగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే ఆనంద్ మాట్లాడుతూ రైతంగానికి ఉచిత కరెంటు, విత్తనాలు, రైతుబీమా, సాగునీరు అందిస్తు రైతులను ఎంతో అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఒక్క తెలంగాణలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఇతర రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులను మంత్రి, ఎమ్మెల్యేలు శాలువలతో సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు ఖాజాపాష, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు నర్సింహులు, నర్సింహారెడ్డి, లావాణ్య, ఉమాదేవి, ఎంపీటీసీలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.