పెద్దేముల్ : ఐఐటీ-జేఈఈ మెయిన్స్-2021లో ఆలిండియా లెవల్లో 900వందల ర్యాంకును సాధించి పెద్దేముల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జేర్పుల వినోద్కుమార్ ఎంతో పేరు ప్రతిష్టతలను తెచ్చిపెట్టాడని బాలుర ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎల్లారెడ్డి అన్నారు. శనివారం మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు వినోద్కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని కందనెల్లి తండాలోని నిరుపేద కుటుంబానికి చెందిన రాంజీనాయక్, సాలీబాయి దంపతుల కుమారుడు వినోద్కుమార్ అక్టోబర్ 03న జరిగిన ఐఐటీ-జేఈఈ మెయిన్స్-2021లో ఆలిండియా లెవల్లో 900 ర్యాంకును సాధించి పాఠశాలకు వన్నె తేవడంతో పాటు పాఠశాల కీర్తి ప్రతిష్టతలను పెంచాడన్నారు.
మాములు నిరుపేద కుటుంబానికి చెందిన వినోద్కుమార్ 2 సంవత్సరాల క్రితం బాలుర ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో 9.5 మార్కులను సాధించి మహాబూబ్నగర్లోని గిరిజన గురుకులంలో సీటు సాధించాడని, ప్రస్తుతం 900ర్యాంకును సాధించాడని గుర్తు చేశారు. వినోద్కుమార్ నాన్న ప్రస్తుతం కుటుంబ పోషణ కోరకు గ్రామంలో ఫాస్ట్పుడ్ సెంటర్ను నడుపుతుండగా, అమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై ఐఐటీలో సీటు సాధించి ఉన్నత చదువులకు వెళుతున్న తరుణంలో ఆయనను పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
వినోద్ కుమార్ మరెన్నో విజయాలను సాధించాలని, తోటి విద్యార్థులు కూడా వినోద్ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి ఉన్నతంగా చదువుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులత, స్థానిక ఎంపీటీసీ అంబరయ్య, జిల్లా, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్చారి, ధన్సింగ్, మాజీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రమేశ్, సంగమేశ్వర్, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.